‘ఇంజినీరింగ్’ కంటే మిన్నగా వార్షిక వేతనం
డెలాయిట్ ఇండియా వర్క్ఫోర్స్–2026 నివేదిక
సాక్షి, అమరావతి: సాధారణంగా ఇంజినీరింగ్ చదివిన వారికి అత్యధిక వేతనాలు ఉంటాయనే అభిప్రాయం ఉంటుంది. అయితే ఎంబీఏ చదివిన వారికీ అత్యధిక వేతనాలు అందుతున్నాయి. మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్(ఎంబీఏ) కోర్సు మణిహారంలా మారింది. దీనిని పూర్తిచేసిన విద్యార్థులకు కంపెనీలు బెస్టు శాలరీ ప్యాకేజ్ అందిస్తున్నాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్ల ట్రెండ్ చూసినా ఇదే విషయం స్పష్టమవుతోంది. పైగా ఇంజినీరింగ్ విద్యార్థుల కంటే కూడా ఎంబీఏ విద్యార్థులు ఎక్కువ శాలరీ ప్యాకేజీ సాధించడం విశేషం.
గత ఐదేళ్లుగా ఇదే తీరు ఉన్నా.. గత మూడేళ్లుగా దేశంలోని టాప్ 10 ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ కాలేజీలలో క్యాంపస్ రిక్రూట్మెంట్ల తీరును పరిశీలిస్తే ఈ విషయం మరింత ప్రస్ఫుటమవుతోంది. ఇదే విషయాన్ని ఆగస్టు 27న విడుదలైన డెలాయిట్ ఇండియా వర్క్ఫోర్స్–2026 నివేదిక కూడా వెల్లడించింది.
జాతీయ ర్యాంకింగ్ల ఆధారంగా దేశంలోని అగ్రస్థానంలో ఉన్న విద్యా సంస్థలతోపాటు, క్యాంపస్ రిక్రూట్మెంట్లు నిర్వహించే ప్రధానమైన 250 రిక్రూటర్లు(సంస్థలు)ను సర్వే చేసి డెలాయిట్ ఇండియా ఈ నివేదికను రూపొందించింది. 2026–27లో నిర్వహించబోయే క్యాంపస్ రిక్రూట్మెంట్లలోనూ ఇంజినీరింగ్ కోర్సుల కంటే ఎంబీఏ కోర్సులకు అధిక ప్రాధాన్యముంటుందని ఆ సంస్థలు వెల్లడించినట్టు ఆ నివేదిక పేర్కొంది. డెలాయిట్ నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ..
⇒ దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థుల శాలరీ ప్యాకేజీ కంటే అగ్రస్థానంలో ఉన్న ఎంబీఏ విద్యార్థులకు మెరుగైన శాలరీ ప్యాకేజీ లభిస్తోంది.
⇒ 2025లో ఇంజినీరింగ్ విద్యార్థుల కంటే ఎంబీఏ విద్యార్థులకు సగటున 47 శాతం అధిక శాలరీ ప్యాకేజీతో క్యాంపస్ రిక్రూట్మెంట్లలో ఉద్యోగాలు పొందారు.
⇒ 2026లో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్లలోనూ ఇంజినీరింగ్ విద్యార్థుల కంటే ఎంబీఏ విద్యార్థులు సగటున 59శాతం అధిక శాలరీ ప్యాకేజీతో ప్లేస్మెంట్లు సాధించారు. ఈ ఏడాది నిర్వహించనున్న మిగిలిన క్యాంపస్ రిక్రూట్మెంట్లలోనూ ఇదే తీరు కొనసాగనుంది.
⇒ ఇక 2027 క్యాంపస్ రిక్రూట్మెంట్లలోనూ ఎంబీఏ విద్యార్థులు మరింత అధిక ప్యాకేజీ సాధిస్తారని అంచనా.
⇒ 2025లో దేశంలో టాప్–10 బిజినెస్ స్కూళ్లలోని విద్యార్థులకు సగటున ఏడాదికి రూ.27.4 లక్షల ప్యాకేజీతో ప్లేస్మెంట్లు లభించాయి. కాగా చిన్న నగరాల్లోని టయర్–3 బిజినెస్ స్కూళ్ల విద్యార్థులకు సగటున ఏడాదికి రూ.8.4 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు దక్కాయి. అయితే దేశంలో టాప్–10 ఇంజినీరింగ్ కాలేజీల్లో విద్యార్థులకు సగటున ఏడాదికి రూ.18.7లక్షల ప్యాకేజీతో ప్లేస్మెంట్లు లభించాయి. చిన్న నగరాల్లో టయర్–3 ఇంజినీరింగ్ కాలేజీల్లో విద్యార్థులకు సగటున ఏడాదికి రూ.5.75 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు దక్కాయి.
⇒ 2026లో ఇప్పటివరకు దేశంలో ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న మేనేజ్మెంట్ కాలేజీల్లో విద్యార్థులకు సగటున ఏడాదికి రూ.27.03 లక్షల శాలరీ ప్యాకేజీ లభించింది. అయితే ఇంజినీరింగ్ విద్యార్థులకు సగటున ఏడాదికి రూ.17 లక్షల శాలరీ ప్యాకేజీ మాత్రమే దక్కింది.
⇒ ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్ల నిర్వహణ బడ్జెట్ను 19 శాతం పెంచాయి.
⇒ ఇంజినీరింగ్, ఎంబీఏ ప్లేస్మెంట్లలో అత్యధికుల ప్రధాన ఎంపిక బెంగళూరుగా ఉంది. ఆ తరువాత స్థానాల్లో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, పుణె ఉన్నాయి.
⇒ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) క్యాంపస్ రిక్రూట్మెంట్లను ప్రస్ఫుటంగా ప్రభావితం చేస్తోంది. 2025లో క్యాంపస్ రిక్రూట్మెంట్లలో ఏఐ పరిజ్ఞానం ఆధారంగా 21శాతం ప్లేస్మెంట్లు కేటాయించారు. కాగా 2026లో ఆ ప్లేస్మెంట్లు 35 శాతానికి పెరిగాయి.


