తూర్పు గోదావరి జిల్లా: నర్సరీలో తన భర్తతో పనిచేసే సురేంద్ర అలియాస్ చిన్న తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు బుర్రిలంకకు చెందిన 19 ఏళ్ల మహిళ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం అనకాపల్లి జిల్లాకు చెందిన మహిళ తన భర్తతో కలిసి బుర్రిలంక నర్సరీకి ఈ ఏడాది జూలైలో పని కోసం వచ్చారు. అప్పటి నుంచి నర్సరీలో పనిచేస్తూ కార్యాలయ భవనం పక్కన నివసిస్తున్నారు.
ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీ ఉదయం సుమారు 6:45 గంటలకు, ఆమె భర్త యథావిధిగా పనికి వెళ్లాడు. అనంతరం 7 గంటలకు అదే నర్సరీలో పనిచేస్తున్న సురేంద్ర అలియాస్ చిన్న ఆమె ఇంటికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె తన భర్తకు చెపుతానని హెచ్చరించడంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అనంతరం 8.50 నిమిషాలకు మళ్లీ వచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఎవరికైనా చెప్తే భార్యాభర్తలిద్దరినీ చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తన భర్తకు ఆమె విషయాన్ని వివరించింది. దీంతో అతడు నర్సరీ యజమానికి ఆ విషయం చెప్పగా ఆయన సూచన మేరకు బాధితురాలు ఆమె బంధువులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: సాధిక్ చేతిలో రూ.2 కోట్ల ఓడీ ఖాతా!


