కాకినాడ క్రైం: పంచాయతీరాజ్ శాఖ పిఠాపురం ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన సాధిక్ ఖాన్ వ్యవహారంలో తవ్వుతున్నకొద్దీ విస్తుపోయే నిజాలు బయట పడుతున్నాయి. నూకరాజు అల్లుడు జగదీశ్వర్రెడ్డికి చెందిన కరూర్ వైశ్యా బ్యాంక్(కేవీబీ)కు సంబంధించి రూ.2 కోట్ల ఓడీ పరిమితి ఉన్న ఖాతా సాధిక్ ఖాన్ చేతికి చిక్కిందనే కీలక విషయం పోలీసుల దృష్టికి వచ్చింది.
ఈ నేపథ్యంలో పోలీసులు కేవీబీ భానుగుడి బ్రాంచికి శుక్రవారం వెళ్లి మేనేజర్ను ఆ ఖాతా వివరాలు ఇవ్వాలని కోరారు. తనకు, జగదీశ్వరరెడ్డికి చెందిన ఖాతాల్లో తన ఫోన్ నంబర్ మార్చి, వాటి ఆర్థిక లావాదేవీలను సాధిక్ ఖాన్ తన చేతుల్లో పెట్టుకున్నాడన్న నూకరాజు కుమార్తె సౌజన్య ఆరోపణలపై లోతైన విచారణ చేపట్టారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. మరింత స్పష్టత కోసం బ్యాంకుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
అలాగే, సాధిక్ సోదరి, తల్లికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా సహా ఇతర బ్యాంకు ఖాతాలపై పరిశీలన మొదలు పెట్టారు. సౌజన్య దగ్గర నుంచి సాధిక్ తీసుకున్న సొత్తును వారికి బదలాయించాడన్న ఆరోపణలపై నిజానిజాలను నిగ్గు తేల్చే పనిలో పోలీసులున్నారు. ఇదిలా ఉండగా సాధిక్ను కోర్టు సోమవారం తమ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉన్నందున ప్రశ్నల వర్షం కురిపించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. అంతకు ముందే పూర్తి వివరాలు, సాక్ష్యాధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
సాధిక్ ఖాన్ కస్టడీ పిటిషన్పైవిచారణ వాయిదా
కాకినాడ లీగల్: పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి కేసులో నిందితుడైన రైఫిల్ ఘాటింగ్ శిక్షకుడు షేక్ సాధిక్ ఖాన్ను పలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. దీనిని న్యాయస్థానం వచ్చే నెల రెండో తేదీకి వాయిదా వేసింది. కస్టడీ పిటిషన్పై శుక్రవారం మొబైల్ కోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు పూర్తి కాకపోవడంతో విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.


