న్యూఢిల్లీ: భారత హిమాలయ ప్రాంతంలో పలు హిమానీనద సరస్సులు విస్ఫోటనం (గ్లోఫ్ - GLOF) చెంది వరదలు సంభవించే ముప్పు పొంచివుంది. ఇలాంటి అత్యంత కీలకమైన 188 సరస్సుల వద్ద ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను (Early Warning Systems) ఏర్పాటు చేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. నేపాల్–టిబెట్ సరిహద్దుల్లో ఇటీవల సంభవించిన భారీ వరద విపత్తులో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అధికారులు ఈ చర్యలను వేగవంతం చేశారు.
శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం 1990 నుంచి 2018 మధ్య కాలంలో హిమానీనద సరస్సుల ఉపరితల విస్తీర్ణం 51 శాతం మేరకు పెరిగిందని ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. ఈ సరస్సుల పరిమాణం, సంఖ్య పెరుగుతుండటం వల్ల లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు పెను ముప్పుగా పరిణమిస్తోందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.5 కోట్ల మంది ప్రజలు ఇలాంటి సరస్సుల విస్ఫోటన వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరిలో సగానికి పైగా ప్రజలు భారత్, పాకిస్థాన్, పెరూ, చైనా దేశాల్లోనే ఉన్నారు.
2023 అక్టోబర్ 4న సిక్కింలోని సౌత్ లోనాక్ సరస్సు విస్ఫోటనం, 2024 ఆగస్టు 16న నేపాల్లోని ఖుంబు ప్రాంతం థామే గ్రామాన్ని ముంచెత్తిన థ్యాన్బో సరస్సు వరదలు తీవ్రతను స్పష్టం చేశాయి. ఈ విపత్తులు కేవలం స్థానిక సంఘటనలు కావని, హిందూకుష్ హిమాలయ ప్రాంత క్రయోస్పియర్లో పెరుగుతున్న విపత్తుల క్రమంలో భాగమని అధికారులు పేర్కొన్నారు. ఎన్ఆర్ఎస్సీ, సీడబ్ల్యూసీ, జీఎస్ఐ, ఐసీఐఎమ్వోడీ వంటి ప్రముఖ సంస్థలు గంగ, బ్రహ్మపుత్ర, సింధు నదీ పరివాహక ప్రాంతాల్లో 7,500కి పైగా హిమానీనద సరస్సులను గుర్తించాయి.
ఇది కూడా చదవండి: ఆప్ నేత దారుణ హత్య.. బైక్ను వెంబడించి..


