కాఠ్మాండు: నేపాల్లో సంభవించిన భయంకరమైన వరదల్లో భారతీయ సంతతికి చెందిన అమెరికా దంపతులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాణాపాయాన్ని గుర్తించిన వెంటనే బస్సు నుంచి దూకి, కేవలం కొన్ని సెకన్లలో 500 మెట్లు ఎక్కి ఎత్తైన ప్రాంతానికి చేరుకుని వారు ప్రాణాలు కాపాడుకున్నారు.
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బే ప్రాంతానికి చెందిన అంజనా రాజా, పట్టాభిరామన్ వెంకటేశన్ తొలిసారి టిబెట్ తీర్థయాత్రకు వెళ్లారు. నేపాల్లోని రసువా జిల్లాలో చైనా సరిహద్దుకు సమీపంలోని టిమురే గ్రామం వద్ద వారి టూర్ బస్సు ప్రయాణిస్తుండగా, ఒక్కసారిగా కొండల నుంచి భారీగా నీరు, మట్టి, రాళ్లు దూసుకొచ్చాయి.
బస్సు డ్రైవర్, కండక్టర్, ఇద్దరు సహాయకులు వెంటనే బస్సు నుంచి దూకడంతో ప్రమాదాన్ని గుర్తించిన దంపతులు కూడా బయటకు దూకారు. అంజనా తన భాగస్వామి వెంకటేశన్ను పట్టుకుని పరుగెత్తాలని చెప్పి, ఇద్దరూ ఎత్తైన ప్రాంతం వైపు పరుగులు తీశారు. మార్గంలో ఇళ్లు కూలిపోవడం, వరదలో ప్రజలు కొట్టుకుపోవడం చూసినా ఆగకుండా ముందుకు సాగారు.
గైడ్ సహాయంతో కేవలం కొన్ని సెకన్లలో 500 మెట్లు ఎక్కి కొండపై సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. రాత్రి స్థానికులతో కలిసి మేకల కొట్టంలో గడిపిన తర్వాత మరుసటి రోజు హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు. తమ ప్రాణాలతో బయటపడటం అద్భుతం కంటే తక్కువ కాదని వెంకటేశన్ చెప్పారు. వారి బస్సులో ఉన్న వారంతా కూడా ప్రాణాలతో బయటపడ్డారు.


