కాఠ్మాండు: నేపాల్లోని పలు ప్రాంతాలను భీకర వరదలు అతలాకుతలం చేస్తున్న వేళ వరద నీటిలో.. బ్యాంకులో నగదు, విలువైన వస్తువులు భద్రపరిచే పెద్ద ఇనుప పెట్టె (సేఫ్) కొన్ని కిలోమీటర్ల మేర కొట్టుకుపోయింది. సేఫ్ను పగులగొట్టి అందులోని డబ్బును తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 29 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రసువాలోని భోటెకోషి ప్రాంతంలో వరదలకు బ్యాంకు సేఫ్ కొట్టుకుపోయినట్లు తెలిసింది. తర్వాత ధాదింగ్లోని గల్చీ గ్రామీణ మున్సిపాలిటీ-4లోని బెల్ఖుఖోలా సమీపంలో త్రిశూలీ నది ఒడ్డున అది కనిపించింది. స్థానికులు సేఫ్ను పగులగొట్టి అందులో ఉన్న నగదును తీసుకెళ్లినట్లు తమకు సమాచారం అందిందని ధాదింగ్ పోలీసులు తెలిపారు.
రూ.57 లక్షలు స్వాధీనం
వెంటనే పోలీసు బృందాన్ని ఘటనాస్థలానికి పంపించి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక తనిఖీల్లో 29 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుంచి 92,68,505 నేపాలీ రూపాయలను అంటే సుమారు రూ.57 లక్షలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
అదుపులోకి తీసుకున్న వారిలో ఎక్కువ మంది గల్చీ-4లోని మస్తార్ నివాసితులు. కొందరు గల్చీ-6లోని ఆదమ్ఘాట్, సిద్ధలేఖ్-7లోని ఆదమ్తార్కు చెందినవారు. మరికొందరు చిత్వన్, పర్సా ప్రాంతాలకు చెందినవారు. ప్రస్తుతం ధాదింగ్లో నివసిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారి వయసు 19 నుంచి 49 ఏళ్ల మధ్య ఉంది. స్వాధీనం చేసుకున్న నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మరికొందరు అనుమానితులు ఉన్నారా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.
మరో దిగ్భ్రాంతికర ఘటనలో, నారాయణి నదిలో వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన బాధితురాలి మృతదేహం నుంచి బంగారు చెవిపోగులు దొంగిలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వరద నీటిలో కొట్టుకుపోయిన ఓ మహిళ మృతదేహం నుంచి బంగారు చెవిపోగుల్లా కనిపిస్తున్న వాటిని ఆ వ్యక్తులు తొలగిస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ కావడంతో ఈ అరెస్టులు జరిగాయి.
భీకర వరదలకు సంబంధించి నేపాల్ విపత్తు సంస్థ శనివారం తన గణాంకాలను గణనీయంగా సవరించింది. ప్రస్తుతం 2,426 మంది గల్లంతైనట్లు తెలిపింది. నిర్ధారించిన మరణాల సంఖ్య 626కి పెరిగినట్లు పేర్కొంది. తాజా వివరాల ప్రకారం గల్లంతైన నేపాలీల సంఖ్య భారీగా పెరిగింది. శుక్రవారం రాత్రి 1,924 మంది గల్లంతైనట్లు ప్రకటించగా, ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. గల్లంతైన విదేశీయుల సంఖ్య 517గానే ఉందని జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ సంస్థ తెలిపింది.


