నేపాల్లో సంభవించిన జలప్రళయం ఊహకందని విషాదాన్ని మిగిల్చింది. వరదలు, కొండచరియల ధాటికి వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, ఎటుచూసినా మృతదేహాల గుట్టలే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే 700కు పైగా మృతదేహాలు బయటపడటంతో మార్చురీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఇంకా వేలాది మంది ఆచూకీ గల్లంతవడంతో రానున్న రోజుల్లో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో గుర్తించని మృతదేహాలను భద్రపరచడం, ఖననం చేయడం నేపాల్ ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది.
నిండిపోయిన మార్చురీలు.. పెరుగుతున్న మృతదేహాలు
నేపాల్లో బుధవారం విరుచుకుపడిన వరద బీభత్సానికి ఇప్పటివరకు 734 మందికి పైగా చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. మరో 2,498 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. సహాయక బృందాలు ఇప్పటివరకు 4,500 మందికి పైగా ప్రజలను రక్షించినప్పటికీ, శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. శవాగారాల్లో స్థలం లేకపోవడంతో గుర్తించని శవాల అంత్యక్రియలను నిర్వహించడం ప్రభుత్వానికి తప్పనిసరిగా మారింది.
ప్రధాని కీలక నిర్ణయం: శాస్త్రీయంగా ఖననం
పౌరుల భద్రతకే తమ మొదటి ప్రాధాన్యమని నేపాల్ ప్రధాని బలేంద్ర షా స్పష్టం చేశారు. గుర్తుతెలియని మృతదేహాలను ఎయిర్టైట్ (గాలి చొరబడని) బ్యాగుల్లో ఉంచి భూమిలో ఖననం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, భవిష్యత్తులో వారి కుటుంబ సభ్యులు తమవారిని గుర్తించేందుకు వీలుగా ప్రతి మృతదేహం నుంచి డీఎన్ఏ నమూనాలను వైద్యులు ముందుగానే సేకరిస్తున్నారు.
శరీర గుర్తులు, లొకేషన్ వివరాల నమోదు
డీఎన్ఏ ప్రొఫైలింగ్తో పాటు మృతదేహాలపై ఉన్న ప్రత్యేక గుర్తులు, పుట్టుమచ్చలు, టాటూలు లేదా గాయాలను అధికారులు క్షుణ్ణంగా రికార్డు చేస్తున్నారు. ఆ మృతదేహం ఏ అవయవంపై లభ్యమైందనే వివరాలను కూడా భద్రపరుస్తున్నారు. శనివారం మధ్యాహ్నం నాటికి 100కు పైగా మృతదేహాల డీఎన్ఏ ప్రక్రియను పూర్తి చేసి, ఖననం చేశారు. ఇది భవిష్యత్తులో కుటుంబసభ్యులు వారిని గుర్తించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
భవిష్యత్తులో వెలికితీసేలా ప్రత్యేక ఏర్పాట్లు
ఎయిర్టైట్ బ్యాగుల్లో ఉంచిన మృతదేహాలను భూమిలో 1.5 మీటర్ల లోతులో ఖననం చేస్తున్నారు. అవసరమైనప్పుడు వీటిని సులభంగా వెలికితీసేందుకు వీలుగా రెండు మృతదేహాల మధ్య సరిగ్గా 40 సెంటీమీటర్ల దూరాన్ని పాటిస్తున్నారు. అంతేకాకుండా, మృతదేహాలను పాతిపెట్టిన ప్రదేశంలో ప్రత్యేక సంఖ్యలతో కూడిన సైన్బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను ఫోటోలు, వీడియోల రూపంలో డిజిటల్గా భద్రపరుస్తున్నారు.
కుళ్లిపోతున్న శవాలు.. వైద్యులకు పెను సవాలు
వరద బురద, శిథిలాల కింద లభ్యమవుతున్న శవాలు త్వరగా కుళ్లిపోతుండటం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. వీటిని భద్రపరిచి డీఎన్ఏ సేకరించేందుకు వైద్యులకు సమయం చాలా తక్కువగా ఉంటోంది. ఇప్పటివరకు 135 మృతదేహాల నుంచి డీఎన్ఏ శాంపిల్స్ సేకరించారు. అత్యధికంగా చిత్వాన్ జిల్లాలో 233 శవాలు లభించగా, కేవలం ఆరింటిని మాత్రమే కుటుంబ సభ్యులు గుర్తించగలిగారు. శవాలు పాడవకుండా ఉండేందుకు కొన్ని నివాస గృహాలను తాత్కాలిక కోల్డ్ సెంటర్లుగా మార్చారు.
మళ్లీ పెరుగుతున్న నదీ ప్రవాహం.. పెను ముప్పు
రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతుండగానే భోటేకోశి నదిలో నీటిమట్టం మళ్లీ ప్రమాదకర స్థాయికి పెరిగినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు, చైనా భూభాగంలో ఏర్పడిన తాత్కాలిక సరస్సు మరింత పెద్దదవుతోందని, ఒకవేళ అది గనక తెగితే నేపాల్లో ఇంతకుముందు కంటే భారీ వరద ముప్పు తప్పదని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు, సహాయక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇది కూడా చదవండి: హిమాలయాల్లో 188 సరస్సుల విస్పోటనం?


