నేపాల్లో వరదలు సృష్టించిన ప్రళయం అంతా ఇంతా కాదు.. దాని తాలుకూ విషాద ఘటనలు ఒక్కక్కొటిగా వెలుగుచూస్తున్నాయి. కొన్ని ఘటనలేమో క్షణాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడం అయితే మరికొన్ని ఘటనలు క్షణాల వ్యవధిలో ప్రాణాలు రక్షించుకోవడం... తాజాగా ఛత్తీస్గఢ్కు చెందిన ఓ బృందం కేవలం టీ తాగడం కోసం ఆగడంతోనే.. తమ ప్రాణాలు దక్కాయని ఆ నిర్ణయంతో ఈ రోజు బ్రతికే ఉన్నామని భావోద్వేగంతో ఈ రోజటి విషాద స్మృతులను గుర్తు చేసుకుంటున్నారు.
రాయ్పూర్లోని మానా క్యాంప్ ప్రాంతానికి చెందిన నారాయణ్ సేన్, దినేశ్ ఓజా, ప్రేమ్ సింగ్ జగత్, యతేంద్ర ప్రకాశ్, దినేశ్ సింగ్ ఠాకూర్ అనే ఐదుగురు సభ్యుల బృందం ఆగస్టు 21న నేపాల్ పర్యటనకు బయలుదేరారు. ఆగస్టు 22న నేపాల్కు చేరుకున్న వీరు ఓ కారును అద్దెకు తీసుకుని పశుపతినాథ్ ఆలయం, మనకామనా ఆలయం సహా పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని భావించారు.
ఆగస్టు 26న ఉదయం సుమారు 10 గంటల సమయంలో వారు నేపాల్లోని ధాదింగ్ జిల్లాలోని ఓ హోటల్ వద్ద టీ తాగేందుకు ఆగారు. అంతలోనే అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముందున్న వంతెన వరదలో కొట్టుకుపోయిందని హోటల్లో వారికి తెలిసింది. ఆ విషాద ఘటనపై వారి మాటల్లో. “ఆగస్టు 26న ఫ్లాష్ ఫ్లడ్ వచ్చినప్పుడు మేము టీ కోసం ఆగడం మా అదృష్టం. మేము 10–15 నిమిషాల ముందే అక్కడి నుంచి బయలుదేరి ఉంటే, వరదలో చిక్కుకుపోయేవాళ్లం. మేం అక్కడ ఆగకపోయి ఉంటే ఏం జరిగేదో ఊహించలేం” అని తెలిపారు.
“హోటల్లో టీ తాగుతున్న సమయంలో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురవడం గమనించాం. ఆ తర్వాత వరద సృష్టించిన విధ్వంసం గురించి తెలుసుకున్నాం. మొత్తం గ్రామాలు, భవనాలు, కార్యాలయాలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయని విన్నాం.మేం అక్కడ చూసిన దృశ్యాలను మాటల్లో వర్ణించడం చాలా కష్టం. మేము నిరంతరం భగవాన్ శివుడి నామస్మరణ చేస్తూనే ఉన్నాం. ఆయన ఆశీర్వాదాలే మమ్మల్ని కాపాడాయని భావిస్తున్నాం” అని తెలిపారు. తర్వాత త్రిశూలి నది ఒడ్డుకు వెళ్లి వరదల పరిస్థితిని ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పారు.
వరదల కారణంగా విద్యుత్, నీరు లేకపోయినా ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉండటంతో వారు భారత్లోని తమ కుటుంబ సభ్యులతో నిరంతరం మాట్లాడగలిగామని పేర్కొన్నారు. అయితే ఈ విషాదంలో వారికి ఓ హృదయాన్ని హత్తుకునే అనుభవం ఎదురైందని అక్కడే విధుల్లో ఉన్న మహిళా భద్రతా సిబ్బంది మా చేతులకు ఆ రాఖీలు కట్టారు. అది మాకు ఎంతో ఓదార్పునిచ్చిన క్షణం అని ఆ విషయాలు మీడియాతో పంచుకున్నారు.
అయితే గత బుధవారం నేపాల్లో సంభవించిన భారీ వరదల కారణంగా మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ రోజు ఆదివారం ఉదయం నాటికి నేపాల్లో అధికారికంగా 734 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.


