కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో కేరళకు చెందిన ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. అదే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో నివసించే వారి స్నేహితురాలే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతులను త్రిస్సూర్ సమీపంలోని ముడిక్కోడ్కు చెందిన అంజన (35), తిరువనంతపురం కేశవదాసపురానికి చెందిన యాన్ మేరీ మాథ్యూ (40)గా గుర్తించారు. నిందితురాలు అనిల అనే మహిళను శాన్ జోస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. నిందితురాలు యాన్ మేరీ ఇంటిలోకి చొరబడి కత్తితో పొడిచి చంపగా, అంజనను కారుతో ఢీకొట్టి హతమార్చినట్లు బంధువులు ఆరోపించారు. ఉద్యోగ సంబంధిత వివాదమే యాన్ మేరీపై దాడికి కారణమని భావిస్తుండగా, అంజన హత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. యాన్ మేరీ గత పదేళ్లుగా అమెరికాలో ఇంజనీర్గా పనిచేస్తుండగా, ఆమె భర్త పల్లాత్ర జాకబ్ కూడా అక్కడే నివసిస్తున్నారు.
అంజన గత ఆరేళ్లుగా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త విజేష్ కూడా కాలిఫోర్నియాలోనే ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఘటనపై త్రిస్సూర్ కలెక్టర్ శిఖా సురేంద్రన్ స్పందిస్తూ, పూర్తి వివరాలను సేకరించి విదేశాంగ మంత్రిత్వ శాఖకు పంపిస్తున్నామని, మృతదేహాలను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి: నదులన్నీ విషతుల్యం.. చేపల వేటపై నిషేధం!


