‘మోదీజీ.. నా జీవితాన్ని నరకం చేశారు’ | Minor Girl Another Video On PM Modi Viral | Sakshi
Sakshi News home page

‘మోదీజీ.. నా జీవితాన్ని నరకం చేశారు’

Aug 31 2026 2:04 PM | Updated on Aug 31 2026 2:13 PM

Minor Girl Another Video On PM Modi Viral

జంతర్‌ మంతర్‌ నిరసనల సమయంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనర్‌ బాలిక వ్యవహారంలో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. తీవ్ర దుమారం రేగడంతో ఆమె క్షమాపణలు చెప్పడం, బాలిక తల్లి కూడా ప్రధాని మోదీకి రిక్వెస్ట్‌ చేయడం.. ఆయన క్షమించేయడం.. పోలీసులు ఉండదని చెప్పడంతో  ఈ వ్యవహారం ఇంతటితో సమసిపోయిందని అంతా భావించారు. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన మరో వీడియో నెట్టింటకు చేరింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో.. ‘మోదీజీ.. మీరు నా జీవితాన్ని నరకం చేశారు’ అంటూ ఆమె ఆరోపించడం సంచలనంగా మారింది. ఘటన తర్వాత తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పినట్లు ఉంది. ‘‘మీరు నన్ను ఎంతగా వెంటాడారంటే.. ప్రతిచోటా వేధింపులకు గురయ్యాను. ఎక్కడికెళ్లినా ముఖం దాచుకోవాల్సి వస్తోంది’’ అని ఆమె అందులో చెప్పినట్లు ఉంది. ఈసారి తాను వెనక్కి తగ్గబోనని, కోల్పోవడానికి తన వద్ద ఏమీ లేదని కూడా పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో స్పష్టత లేదు. అయితే ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ దీనిని తమ అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాల్లో షేర్‌ చేశాయి. బాలికను బెదిరించి, క్షమాపణ చెప్పేలా ఒత్తిడి చేశారని ఇరు పార్టీలు మండిపడ్డాయి. మరోవైపు.. బాలిక తరఫు న్యాయవాది మాత్రం ఆ వీడియో ఏఐ జనరేటెడ్‌ కాదని, అందులో ఉందని ఆమెనేనని వ్యాఖ్యానించారు. కానీ, ఆ వీడియో ఎప్పుడు తీశారనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

జులై 23న జంతర్‌ మంతర్‌ నీట్‌ నిరసనల సమయంలో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని సదరు బాలిక తిట్టిపోసింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్‌ చాందెల్‌ ఫిర్యాదు చేయడంతో జూలై 29న నోయిడాలోని ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్‌ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అనంతరం కేసును దర్యాప్తు కోసం ఢిల్లీకి బదిలీ చేశారు. తొలుత ఆమె వయసును పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో తప్పుగా పేర్కొన్నారు. అయితే.. తన వయసు 15 ఏళ్లేనని.. కొందరు రెచ్చగొట్టి అలా మాట్లాడించారని ఆ తర్వాత ఆమె క్షమాపణలు చెప్పింది.

మకాం మార్చేసి..
జంతర్‌ మంతర్‌ ఘటన వివాదం, కేసు భయంతో ఆమె కుటుంబం ఆందోళనకు గురైంది. తమకు వేధింపులు వస్తున్నాయని, తన బిడ్డ చేసిన తప్పును పెద్ద మనుసుతో మన్నించాలని తల్లి, ప్రధాని మోదీని వేడుకుంది. ఆ తర్వాత నోయిడాలోని నివాసాన్ని ఖాళీ చేసి ప్రస్తుతం హరియాణాలో తల్లిదండ్రులతో ఉంటున్నట్లు తెలిసింది.

‘యువతకు మరో అవకాశం ఇవ్వాలి’
ఈ వివాదంపై స్పందించిన ప్రధాని మోదీ.. ఈ ఘటనలో పాల్గొన్న యువతపై కఠిన చర్యలకు బదులుగా వారిని క్షమించి మరో అవకాశం ఇవ్వాలని అన్నారు. దీంతో వివాదం క్రమంగా సద్దుమణిగినట్లు కనిపించింది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోతో ఈ వ్యవహారం మళ్లీ రాజకీయ చర్చకు వచ్చింది. 

ఇదీ చదవండి: డింపుల్‌.. మామూలు దూకుడు కాదది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement