పాక్‌కు నీళ్లు బంద్‌.. భారత్‌ ‘నో కాంప్రమైజ్‌’! | India Rejects Arbitration Ruling on Indus Waters Treaty | Sakshi
Sakshi News home page

పాక్‌కు నీళ్లు బంద్‌.. భారత్‌ ‘నో కాంప్రమైజ్‌’!

Sep 1 2026 7:58 AM | Updated on Sep 1 2026 8:25 AM

India Rejects Arbitration Ruling on Indus Waters Treaty

నీళ్ల విషయంలో పాకిస్తాన్‌కు భారత్‌ మరోసారి గట్టి షాక్‌ ఇచ్చింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తమ నిర్ణయం వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. హేగ్‌లోని శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఒప్పందాన్ని పునరుద్ధరించాలని సూచించినా.. భారత్‌ సార్వభౌమ నిర్ణయాలపై తీర్పులు ఇచ్చే అధికారం ఆ కోర్టుకు లేదని కేంద్ర విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది. పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం కొనసాగుతుందని స్పష్టం చేస్తూ.. పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నంత కాలం నీటి విషయంలోనూ వెనక్కి తగ్గబోమని భారత్‌ సంకేతాలు ఇచ్చింది. ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ అమల్లోనే ఉందని తేల్చిచెప్పింది.

కాగా, 1960 సెప్టెంబర్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందం.. సింధు నదీ వ్యవస్థలోని జలాల వినియోగం, పంపిణీకి సంబంధించి ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందంగా కొనసాగుతోంది. అయితే, గతేడాది ఏప్రిల్‌ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత పాకిస్తాన్‌పై భారత్‌ పలు కఠిన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని ‘అబేయన్స్‌’లో ఉంచుతున్నట్లు ప్రకటించింది.

భారత్‌ తాజా నిర్ణయానికి పహల్గామ్‌ ఉగ్రదాడితో పాటు పాకిస్తాన్‌ భూభాగం నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఉగ్రవాదమే ప్రధాన కారణమని కేంద్రం స్పష్టం చేస్తోంది. పాక్‌లో తన భూభాగం నుంచి పనిచేస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ధ్వంసం చేసే విషయంలో నమ్మదగిన, తిరుగులేని చర్యలు తీసుకునే వరకు ఒప్పంద కార్యకలాపాలు పునరుద్ధరించబోమని భారత్‌ స్పష్టం చేసింది.

మధ్యవర్తిత్వ ప్రక్రియపైనా అభ్యంతరం..
మరోవైపు.. భారత్‌-పాకిస్థాన్ మధ్య కిషన్‌గంగా, రాట్లే జలవిద్యుత్‌ ప్రాజెక్టుల డిజైన్‌కు సంబంధించి తలెత్తిన విభేదాలపై పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వాన్ని కోరింది. ఈ అంశాలపై శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం విచారణ చేపట్టింది. అయితే, భారత్‌ మొదటి నుంచే ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తోంది. ఇలాంటి వివాదాలు సాంకేతిక అంశాలకు సంబంధించినవని, ఒప్పందంలో పేర్కొన్న విధంగా ‘న్యూట్రల్‌ ఎక్స్‌పర్ట్‌’ ద్వారా వాటిని పరిష్కరించాల్సి ఉంటుందని భారత్‌ వాదిస్తోంది. అదే అంశాలను ఒకేసారి మధ్యవర్తిత్వ న్యాయస్థానం పరిశీలించడం ఒప్పందంలోని వివాద పరిష్కార విధానానికి విరుద్ధమని చెబుతోంది. ప్రపంచ బ్యాంకు ఒప్పంద నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ మధ్యవర్తిత్వ సంస్థను ఏర్పాటు చేసిందని భారత్‌ ఆరోపించింది. ఈ సంస్థ గతంలో వెలువరించిన వ్యాఖ్యలు, తీర్పులను కూడా భారత్‌ గుర్తించలేదని విదేశాంగ శాఖ పేర్కొంది.

ఇదీ చదవండి: ‘అప్పుడు సీజేపీ నేతలు నిరసనలు వదిలేద్దామనుకున్నారు’

అంతేకాదు.. ఈ మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఏర్పాటే సింధు జలాల ఒప్పందానికి తీవ్రమైన ఉల్లంఘన అని భారత్‌ మొదటి నుంచి చెబుతోందని స్పష్టం చేసింది. ఈ సంస్థ ముందు భారత్‌ హాజరుకాలేదని, దాని గత తీర్పులను కూడా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపింది. ‘భారత్‌ సార్వభౌమ నిర్ణయాలపై తీర్పు చెప్పే అధికారం ఈ కోర్టుకు లేదు. ఇప్పుడు గానీ, భవిష్యత్తులో గానీ ఈ సంస్థ చేసే వ్యాఖ్యలు భారత్‌ చేపడుతున్న ప్రాజెక్టుల విషయంలో తమ చర్యలపై ఎలాంటి ప్రభావం చూపవు’ అని కేంద్రం స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement