సేవా భావం మన నాగరికతా స్వభావం
ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ స్పష్టీకరణ
వాషింగ్టన్: ఎలాంటి వివక్ష లేకుండా ఇతరులకు సాయపడటమే భారతదేశ నాగరికతా సంప్రదాయాల ముఖ్య సారమని, భారత్ ప్రపంచానికి విశ్వగురువుగా సేవలు అందించిందే తప్ప అగ్రరాజ్యంగా కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. కెనడాలోని టొరంటోలో ‘కెనడియన్ హిందూస్ ఫర్ అవుట్రీచ్, రిలేషన్స్ అండ్ డైలాగ్’ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
హిందూ ప్రపంచ దృక్పథం సార్వత్రికమైందని, ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే సిద్ధాంతాన్ని విశ్వసిస్తుందని చెప్పారు. సేవాభావం భారతీయ నాగరికతా స్వభావానికి ప్రధాన నిర్వచనమని భాగవత్ ఉద్ఘాటించారు. ‘ప్రపంచంలో ఎవరు సాయం కోరినా భారత్ ఎన్నడూ నిరాకరించలేదు, అడగకున్నా ఆపన్నహస్తాన్ని అందిస్తుంది. ఇది మన సంప్రదాయం, భారత డీఎన్ఏ. అందుకే హిందువులు మేల్కొంటే, ప్రపంచమే మేల్కొంటుంది అనే సామెత వచ్చిందని భాగవత్ పేర్కొన్నారు.
ప్రేమ అనే సందేశాన్ని అర్థం చేసుకోలేనప్పుడు ఒక వ్యక్తి సంపాదించిన జ్ఞానమంతా అర్థరహితమేనని చెప్పడానికి ఆయన సంత్ కబీర్ దోహాలను ఉదహరించారు. కబీర్ మహారాజ్ చెప్పినట్లు... మీరు ఎన్నో పుస్తకాలు చదివి గొప్ప విద్వాంసులు కావచ్చు, కానీ ప్రేమ అనే ఆ రెండక్షరాలను అర్థం చేసుకోకపోతే ఆ జ్ఞానానికి ఏ అర్థమూ లేదు’అని భాగవత్ వివరించారు.
మానవాళిలో అంతర్లీనంగా ఉన్న ఏకత్వాన్ని గుర్తిస్తూనే, వైవిధ్యాన్ని కూడా స్వీకరించాలని ఆయన ఉద్బోధించారు. ‘వైవిధ్యం ఏకత్వానికి ప్రతీక. అది ఏకత్వానికి అందాన్ని, అలంకారాన్ని ఇస్తుంది. అందుకే మనం వైవిధ్యాన్ని నిష్పాక్షికంగా అంగీకరించాలి, గౌరవించాలి. ఇందుకు మనం గరి్వంచాలి. సంతోషించాలి’అని ఆయన అన్నారు. ‘మన ప్రాచీన సంస్కృతి వైవిధ్యాన్ని సహ జమైనదిగా గుర్తిస్తుంది. అయితే ఏకత్వమే అసలైన నిజం. అదే మన పురాతన జీవన విధానం’అని ఆయన పేర్కొన్నారు.


