సాక్షి, చెన్నై: తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాల్లో సెల్ఫోన్లపై నిషేధం మంగళవారం (సెప్టెంబర్ 1) నుంచి అమల్లోకి వచ్చింది. 52 ప్రముఖ ఆలయాల్లో సెల్ఫోన్ల వాడకంపై సంపూర్ణ నిషేధం విధించనున్నట్లు ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రమేష్ తెలిపారు. ఆలయంలోకి ప్రవేశించే ముందే భక్తులు తమ వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను సేఫ్ డిపాజిట్ కౌంటర్లలో అప్పగించాలని, ఇందుకోసం రూ.5 రుసుము వసూలు చేస్తామని చెప్పారు.అలాగే, మూలవిరాట్టు లేదా ఆలయ ప్రాంగణంలో ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సినీ ప్రముఖులు, ఇతర వీఐపీలు కూడా ఆలయం లోపల ఫొటోలు దిగడానికి అనుమతిలేదని స్పష్టం చేశారు. నిషేధం అమల్లోకి రానున్న ఆలయాల్లో కాంచీపురం కామాక్షి అమ్మన్– వరదరాజ పెరుమాళ్ ఆలయం, మదురై మీనాక్షి అమ్మన్ ఆలయం, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం, శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం, రామేశ్వరం రామనాథస్వామి ఆలయం తదితర ప్రముఖ దేవాలయాలున్నాయి.


