ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాలోని శిఖపరువు గిరిజన ప్రాంతంలో వర్షాకాలంలో ప్రకృతి అందాలు, జలపాతాల జలసవ్వడులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
కనుచూపు మేర పచ్చని కొండలు... వాటి మధ్యగుండా సన్నని ధారలా జాలువారే జలపాత హోయలు.. ఆ నీటితో సాగయ్యే కొండపోడు పంటల పచ్చని అందాలు... పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం శిఖపరువు గ్రామానికి వెళ్లేవారిని హత్తుకుంటాయి.
పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతాయి. కొండ శిఖరాన చిన్నచిన్న ఇళ్లలో కాలం వెళ్లదీస్తున్న అమాయక గిరిజనుల సంప్రదాయ వస్త్రధారణ, జీవన విధానం ఆలోచింపజేస్తాయి.
వారి ఆప్యాయతలు అక్కున చేర్చుకుంటాయి. ఇక్కడి పర్యాటక అందాలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పర్యాటకులు వస్తున్నారు.
ఇక్కడి జలపాత నీటి ధారలో తడిసి మురిసిపోతున్నారు. జలపాతం వరకు వెళ్లేందుకు నేరుగా రోడ్డు మార్గం ఉండడం పర్యాటకులకు ప్రయాణం సుఖవంతమవుతోంది.
– సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం


