సాక్షి, హైదరాబాద్: సస్పెండైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం.ఉదయ్ కృష్ణారెడ్డికి పొటెన్సీ పరీక్ష నిర్వహించేందుకు మంగళవారం వరకు పట్టుబట్టవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు దర్యాప్తు అధికారికి ఉత్తర్వులు జారీ చేస్తూ, విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితుడు ఉదయ్కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ జె. శ్రీనివాస్రావు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది అశోక్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 52 కింద పొటెన్సీ పరీక్ష నిర్వహించేందుకు అనుమతిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. దర్యాప్తు అధికారి కోరిన పరీక్షకు అనుమతించడం చట్టపరంగా సముచితం కాదన్నారు. దర్యాప్తులో భాగంగానే పొటెన్సీ పరీక్ష నిర్వహించాల్సి ఉందని పీపీ పల్లె నాగేశ్వరరావు వాదించారు.
సుమంత్కు ముందస్తు రక్షణకు నిరాకరణ..
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ నర్ల సుమంత్కు దర్యాప్తు నుంచి తక్షణ రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. తనపై పోలీసులు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరగా.. వాదనలు వినకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంత సమయం కావాలని, అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరడంతో తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. హత్యాయత్నం కేసులో సుమంత్ను జూబ్లీహిల్స్ పోలీసులు వెతుకుతున్న విషయం విదితమే. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ జె.శ్రీనివాస్రావు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
చదవండి: అమెరికాలో పెళ్లి.. సూర్యాపేట నుంచి అక్షింతలు!


