సీసీటీవీ పుటేజ్
సాక్షి, నల్గొండ జిల్లా: నల్గొండలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బీజేపీ కార్యాలయం, జిల్లా అధ్యక్షుడి ఇంటిపై దాడి నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నల్లగొండకు రానున్నారు. మరో వైపు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా నల్గొండలో పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం దాడులు, నేతల పర్యటనల నేపథ్యంలో పోలీసుల అలర్ట్ అయ్యారు. మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పార్టీ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద పోలీస్ బందోబస్తు చేపట్టారు. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల దాడులు, నిరసనలతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బీజేపీ రాష్ట్ర కార్యాలయ గేటుకు కాంగ్రెస్ శ్రేణులు నల్లరంగు వేయగా, ప్రతిగా నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడికి దిగాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై, బిహార్లో విద్యార్థులపై బీజేపీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు.
బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న గేటుకు నల్ల రంగు పూసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు యూత్ కాంగ్రెస్ శ్రేణులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే యూత్ కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు.


