ధర్నాలో మాట్లాడుతున్న రాంచందర్రావు
22ఏ భూములకు వెంటనే విముక్తి కల్పించాల్సిందే
సీఎం రేవంత్రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు
సాక్షి, సిద్దిపేట: ‘22ఏ జాబితాలో చేర్చిన భూము లకు వెంటనే విముక్తి కల్పించాలి..లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తాం’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు హెచ్చరించారు. ధరణి కంటే దారు ణంగా భూభారతి మారిందన్నారు. 22ఏలో చేర్చిన భూములను తొలగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్రావు హాజరై మాట్లాడారు. 22ఏ జాబితా విషయంలో పొరపాట్లు జరిగాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్వయంగా అంగీకరించారని, వాటిని వెంటనే సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఒక ఫ్యామిలీ.. ఇప్పుడు బ్రదర్స్ బాగుపడు తున్నారన్నారు.
సీఎం ఇల్లు ఎలా బయటపడిందో చెప్పాలి
జూబ్లీహిల్స్లోని 403 సర్వే నంబర్లో కేవలం రెండు ప్లాట్లు మాత్రమే ప్రభుత్వ భూములని, మిగతా భూములను సైతం 22ఏ జాబితాలో చేర్చా రని రాంచందర్రావు ఆరోపించారు. ఇదే జాబితాలో సీఎం రేవంత్రెడ్డి నివాసం కూడా ఉందని, ఆ ఇల్లు 22ఏ జాబితా నుంచి ఎలా బయటపడిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడుతున్నాయని చెప్పారు. 22ఏలో జరిగిన గందరగోళాన్ని సిట్టింగ్ హైకోర్టు జడ్జి ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రేవంత్రెడ్డి చేసిన దరఖాస్తు చూపించాలి: రఘునందన్రావు
22ఏ జాబితాలో ఉన్న తన ఇల్లు తొలగింపు కోసం రేవంత్రెడ్డి చేసిన దరఖాస్తును ప్రజలకు చూపించాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు డిమాండ్ చేశారు. ఎలాంటి దరఖాస్తు లేకుండానే సీఎం ఇల్లు నిషేధిత భూముల్లో నుంచి తొలగించారని ఆరోపించారు. ‘పొట్టోడికి పరిపాలన రాదు.. భూముల లిటికేషన్ పెట్టడం మాత్రం వచ్చు’ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు.


