దేశంలో డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ ద్వారా జరిగే రూ.2,000 వరకు ఉన్న రూ పే (RuPay) డెబిట్ కార్డు, యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు లేదా డిజిటల్ పేమెంట్ సర్వీసు సంస్థలు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ‘పేమెంట్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్, 2007’ చట్టంలో మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
సామాన్యులు, చిన్న వ్యాపారులకు ఊరట
తాజా ఉత్తర్వుల ప్రకారం.. రూ.2,000 లోపు జరిపే లావాదేవీలపై చెల్లింపుదారుల నుంచి కానీ, స్వీకరించే వారి (మర్చంట్లు) నుంచి కానీ నేరుగా లేదా పరోక్షంగా ఎటువంటి రుసుమును వసూలు చేయరాదని స్పష్టంచేశారు. ఈ నిర్ణయం దేశంలోని అత్యధిక శాతం డిజిటల్ లావాదేవీలకు వర్తిస్తుంది. రోజువారీ సామాన్య ప్రజలు, చిన్న తరహా వ్యాపారులు జరిపే చిన్న మొత్తాల డిజిటల్ చెల్లింపులపై ఎలాంటి అదనపు భారం పడకుండా ఉంచడమే దీని ప్రధాన లక్ష్యం.
పెద్ద మొత్తాల లావాదేవీలపై మార్గదర్శకాలు?
అయితే, ప్రభుత్వం నోటిఫికేషన్లో రూ.2,000 వరకు ఉన్న లావాదేవీలను మాత్రమే ప్రత్యేకంగా పేర్కొనడం గమనార్హం. అంతకంటే ఎక్కువ మొత్తం (భారీ లావాదేవీలు) జరిపే నగదు బదిలీలపై ఛార్జీలు విధించేందుకు ఇది మార్గం సుగమం చేసినట్లయింది. అయితే, పెద్ద మొత్తాల లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారా లేదా, ఒకవేళ విధిస్తే ఎంత మేర ఉంటాయనే దానిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ఆర్బీఐ వద్ద ఉన్న నిధుల ద్వారా మర్చంట్లు, వినియోగదారులపై భారం పడకుండా యూపీఐ ప్లాట్ఫామ్ నిర్వహణ ఖర్చులను భరించవచ్చని కేంద్రం తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశంలో క్యాష్లెస్ ఎకానమీ మరింత వేగంగా విస్తరించనుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: కాలంతో పోటీపడిన సాంకేతిక శిఖరం.. మోక్షగుండం!


