2008 ముంబై ఉగ్రదాడుల కేసులో పాకిస్థాన్ వ్యవహారశైలిపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) తాజాగా విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ‘రెడ్ బుక్’లో 26/11 దాడులతో సంబంధం ఉన్న 19 మంది పేర్లు మరోసారి తెరపైకి వచ్చాయి. అయితే వారిలో ఇద్దరికి సంబంధించిన కీలక వివరాలు గత జాబితాతో పోలిస్తే కనిపించకుండా పోయాయి. వారి ఫొటోలు, లష్కరే తోయిబాతో సంబంధం, దాడులకు సంబంధించిన కార్యకలాపాల వివరాలను తాజా జాబితా నుంచి తొలగించారు.
ఇద్దరి వివరాలు ఎందుకు మాయం?
బలూచిస్థాన్లోని తుర్బత్కు చెందిన ముహమ్మద్ ఖాన్ పేరు తాజా జాబితాలో ఉన్నప్పటికీ, అతని ఫొటో, లష్కరే తోయిబాతో సంబంధం, 2008 దాడుల్లో అతని పాత్రకు సంబంధించిన వివరాలు లేవు. గతంలో ఉగ్రవాదులు భారత్ వైపు వెళ్లేందుకు ఉపయోగించిన అల్-హుస్సైనీ అనే చేపల పడవను సమకూర్చిన వ్యక్తిగా అతడిని గుర్తించారు. అలాగే బహావల్నగర్కు చెందిన అబ్దుల్ రెహ్మాన్ వివరాల్లోనూ ఫొటో, సంస్థతో సంబంధం తొలగిపోయాయి. 2021లో విడుదలైన ఇదే ‘రెడ్ బుక్’లో ఈ ఇద్దరి వివరాలు పూర్తిగా ఉన్నాయి.
పడవ సిబ్బంది వివరాలు
తాజా జాబితాలో ఫొటోలు కొనసాగించిన 11 మంది గురించి అల్-హుస్సైనీ, అల్-ఫౌజ్ పడవలకు చెందిన మాజీ లష్కర్ సిబ్బందిగా పేర్కొన్నారు. బహావల్పూర్లోని ఇస్లామీ కాలనీకి చెందిన షాహిద్ ఘఫూర్ రెండు పడవలకు కెప్టెన్ లేదా ‘తండేల్’గా పేర్కొన్నారు. సాహివాల్కు చెందిన ముహమ్మద్ ఉస్మాన్, లాహోర్కు చెందిన అతీక్ ఉర్ రెహ్మాన్, హఫీజ్బాద్కు చెందిన రియాజ్ అహ్మద్, గుజ్రన్వాలాకు చెందిన ముహమ్మద్ ముష్తాక్ తదితరుల పేర్లు కూడా ఉన్నాయి. పంజాబ్, సింధ్ ప్రాంతాలకు చెందిన పలువురు ఈ జాబితాలో ఉన్నారు.
ఆరుగురిపై ‘నిధుల’ ఆరోపణలు
మరో ఆరుగురిని దాడులకు ఆర్థిక సహాయం చేసినవారిగా ఎఫ్ఐఏ పేర్కొంది. ఫైసలాబాద్కు చెందిన ముహమ్మద్ ఇఫ్తిఖార్ అలీ ముష్కరులు, వారి నిర్వాహకులు ఉపయోగించిన వాయిస్-ఓవర్-ఇంటర్నెట్ కనెక్షన్ల కోసం రూ.70,000 ఖర్చు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రావల్పిండికి చెందిన ముహమ్మద్ జియా, ఖనేవాల్కు చెందిన ముహమ్మద్ అబ్బాస్ నాసిర్, కసూర్కు చెందిన జావెద్ ఇక్బాల్, మండి బహౌద్దీన్కు చెందిన ముక్తార్ అహ్మద్, బట్టాగ్రామ్కు చెందిన అహ్మద్ సయీద్ పేర్లు కూడా ఉన్నాయి. వీరిలో అహ్మద్ సయీద్ రూ.21 లక్షలు సమకూర్చినట్లు జాబితాలో పేర్కొన్నారు.
18 ఏళ్లుగా పరారీలోనే..
పూర్తి వివరాలతో ఉన్న 17 మంది గత 18 ఏళ్లుగా పరారీలో ఉన్నారని ఎఫ్ఐఏ పేర్కొంది. అయితే భారత అధికారుల ప్రకారం.. వీరిలో పలువురు ఇప్పటికీ పాకిస్థాన్లోనే ఉన్నారు. అరెస్టులు చేయకుండా కేవలం జాబితాలో పేర్లు చేర్చడం అంతర్జాతీయ ఒత్తిడిని తగ్గించేందుకు చేస్తున్న చర్య మాత్రమేనని, ఇది ‘కంటితుడుపు చర్య’ అని వారు పేర్కొన్నారు. అయితే తాజా ఎఫ్ఐఏ పత్రాలు దాడుల కేసులో పడవ సిబ్బందిని పాకిస్థాన్ దర్యాప్తు సంస్థలు ఇంకా వాంటెడ్ వ్యక్తులుగానే పరిగణిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.
సముద్ర మార్గంలో ముంబైకి..
2008 నవంబర్ చివర్లో ఉగ్రవాదులు కరాచీ ప్రాంతం నుంచి బయలుదేరి సముద్రంలో ప్రయాణించారు. అనంతరం భారత చేపల వేట నౌక కుబేర్ను స్వాధీనం చేసుకుని, దాని సిబ్బందిని హతమార్చి, చిన్న రబ్బరు పడవల ద్వారా ముంబై తీరానికి చేరుకున్నారు. దాడికి ఉపయోగించిన పడవగా అల్-హుస్సైనీని గుర్తించారు. దానిని పాకిస్థాన్లో నిలిచిపోయిన విచారణలో కేసు ఆస్తిగా పరిగణించారు.
న్యాయం కోసం ఎదురుచూపులు
26/11 దాడులు మూడు రోజులపాటు కొనసాగాయి. తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, యూదుల ప్రార్థనా కేంద్రం, కేఫేలతో పాటు పలు ప్రాంతాలు లక్ష్యంగా మారాయి. ఈ దాడుల్లో 166 మంది మరణించగా, 300 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. పది మంది ఉగ్రవాదుల్లో తొమ్మిది మంది హతమయ్యారు. ఏకైక ప్రాణాలతో పట్టుబడిన అజ్మల్ కసబ్ను భారత్లో అనంతరం ఉరి తీశారు. దాడుల వెనుక ఉన్న నిందితులు, కుట్రదారులు, కీలక సూత్రధారులను పూర్తిగా చట్టం ముందుకు తీసుకురావాల్సి ఉందన్న డిమాండ్ కొనసాగుతోంది. హఫీజ్ సయీద్, జకీర్ రెహ్మాన్ లఖ్వీ, సజిద్ మీర్ వంటి లష్కరే తోయిబా నిర్వాహకులు, సూత్రధారులపై భారత్ విచారణ ప్రక్రియను చేపడుతోంది.
ఇదీ చదవండి: ‘యూపీ’ ఎన్నికలు: రెండు శాతమున్న ‘జాట్’లే శాసనకర్తలుగా..


