ఒకే ప్రిస్క్రిప్షన్లో ఎక్కువ మందులు రాయడం ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ మరోసారి మొదలైంది. తాజా అధ్యయనం ప్రకారం పాకిస్థాన్లో ఆసుపత్రుల్లో ఒక్కో ప్రిస్క్రిప్షన్కు సగటున 4.2 మందులు సూచిస్తున్నట్లు తేలింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించే సగటు 1.6 నుంచి 1.8 మందులతో పోలిస్తే చాలా ఎక్కువ.
ఇస్లామాబాద్లోని హెల్త్ సర్వీసెస్ అకాడమీ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం ‘డిస్కవర్ పబ్లిక్ హెల్త్’ పత్రికలో ప్రచురితమైంది. పేషావర్లోని ఒక పెద్ద ఆసుపత్రిలో ఒక్కో ప్రిస్క్రిప్షన్కు సగటున 10.56 మందులు సూచించినట్లు అధ్యయనంలో వెల్లడైంది. అదే సమయంలో ప్రతి 4 మందుల్లో కేవలం ఒక మందును మాత్రమే జనరిక్ పేరుతో సూచించినట్లు తేలింది.
భారత్లో..
భారత్లోనూ పరిస్థితి పూర్తిగా భిన్నంగా లేదని అందుబాటులో ఉన్న అధ్యయనాలు సూచిస్తున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్లో ప్రచురితమైన నివేదిక ప్రకారం, భారతదేశంలో ఔట్పేషెంట్ ప్రిస్క్రిప్షన్లపై జరిగిన వివిధ అధ్యయనాల్లో ఒక్కో ప్రిస్క్రిప్షన్కు సగటున 2.2 నుంచి 3.9 మందులు సూచించినట్లు నమోదైంది. ఇది కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించే పరిధి కంటే ఎక్కువ.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఒక్కో ప్రిస్క్రిప్షన్లో సగటున 1.6 నుంచి 1.8 మందులు ఉండటం, సాధ్యమైనంత వరకు జనరిక్ పేర్లతో మందులు సూచించడం, అవసరమైనప్పుడే యాంటీబయాటిక్స్, ఇంజెక్షన్లు ఉపయోగించడం వంటి అంశాలు ముఖ్యమైనవి.
అయితే ప్రతి సందర్భంలో రెండు కంటే ఎక్కువ మందులు రాయడం తప్పు కాదు. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి పలు సమస్యలు ఒకేసారి ఉన్నప్పుడు, అలాగే క్షయ, క్యాన్సర్, హెచ్ఐవీ వంటి కొన్ని వ్యాధుల్లో ఒకటి కంటే ఎక్కువ మందులు అవసరం కావచ్చు.
అవసరం లేకుండా ఎక్కువ మందులు తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు, ఒక మందు మరో మందుతో ప్రతిక్రియ చెందే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా వృద్ధులు, ఇప్పటికే పలు వ్యాధులతో బాధపడుతున్నవారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చు. కాలేయం, మూత్రపిండాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. వైద్యులు ఎక్కువ మందులు సూచించినప్పుడు వాటి అవసరం, వాడాల్సిన కాలం గురించి వారిని అడగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


