ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ క్రికెట్ జట్లకు గడ్డుకాలం నడుస్తోంది. ఆ దేశ పురుష, మహిళా జట్లు చెత్త ప్రదర్శనలతో ఆడిన ప్రతి మ్యాచ్లో ఘోర పరాజయాలు ఎదుర్కొంటున్నారు. ఇవి చాలవన్నట్లు ఆ జట్లకు ఐసీసీ వరుస షాక్లు ఇస్తుంది.
మహిళల ఆసియా కప్లో భాగంగా భారత్తో జరిగిన గ్రూప్ మ్యాచ్లో ఓవరాక్షన్ చేసినందుకు ఆ జట్టు కెప్టెన్ ఫాతిమా సనాకు అక్షింతులు వేసింది ఐసీసీ. ఇది జరిగి రోజులు గడవకముందే ఆ దేశ పురుషుల జట్టును కూడా ఐసీసీ తలంటింది.
డబ్ల్యూటీసీలో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్ట్లో స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ చేసినందుకు పాక్ జట్టు మొత్తానికి 50 శాతం జరిమానా విధించారు. అలాగే 11 డబ్ల్యూటీసీ పాయింట్లు కోత విధించారు.
ఇది జరిగిన రోజే ఐసీసీ పాక్ మహిళల జట్టుకు మరోసారి షాకిచ్చింది. పురుషుల జట్టుకు భారీ శిక్ష పడిన గంటల వ్యవధిలోనే మహిళల జట్టుపై మరోసారి కొరడా ఝులిపించింది. ఆసియా కప్ సెమీఫైనల్లో (శ్రీలంకపై) స్లో ఓవర్రేట్తో బౌలింగ్ చేసినందుకు మ్యాచ్ ఫీజ్లో 5 శాతం జరిమానా విధించింది.
ప్రదర్శనల విషయానికొస్తే.. పాక్ మహిళల జట్టు ఆసియా కప్ సెమీఫైనల్లోనే శ్రీలంక చేతిలో చావుదెబ్బ తిని టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. టైటిల్ గెలిచికా భారత జట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు కూడా అయిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోకుండా పాక్కు బుద్ది చెప్పింది.
పురుషుల జట్టు విషయానికొస్తే.. ఈ జట్టు ప్రదర్శనల పరంగానే కాకుండా ప్రవర్తన విషయంలోనూ నవ్వులపాలైంది. ఆ జట్టులోని ఏడుగురు సభ్యులను ఇంగ్లండ్ పర్యటన మధ్యలోనే క్రమశిక్షణ చర్యల పేరుతో స్వదేశానికి పిలిపించుకున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను పాక్ 0-3 తేడాతో కోల్పోయి, ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది.
ఇదీ చదవండి: టీమిండియాకు ఊహించని షాక్


