source: X
తాజాగా ఇంగ్లండ్ చేతిలో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 0-3 తేడాతో కోల్పోయి బాధలో ఉన్న పాకిస్తాన్ జట్టుకు, ఆ పరాభవం నుంచి తేరుకోకముందే మరో షాక్ తగిలింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన చివరి టెస్టులో స్లో ఓవర్రేట్ కారణంగా ఆ జట్టు ఖాతా నుంచి 11 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పాయింట్లు కోత విధించారు. దీంతో పాటు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా పడింది.
ఎడ్జ్బాస్టన్ టెస్టులో పాక్ తొలి ఇన్నింగ్స్లో 89 ఓవర్లు బౌలింగ్ చేసింది. సమయానికి సంబంధించిన అనుమతులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా నిర్ణీత ఓవర్రేట్ కంటే 11 ఓవర్లు తక్కువగా వేసినట్లు తేలింది.
ఐసీసీ WTC ప్లేయింగ్ కండిషన్స్లోని ఆర్టికల్ 16.11.2 ప్రకారం నిర్ణీత ఓవర్ల కంటే ప్రతి ఓవర్ తక్కువగా వేసినందుకు ఒక WTC పాయింట్ కోత విధిస్తారు. అదే విధంగా ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం ప్రతి ఓవర్కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధిస్తారు. అయితే ఈ జరిమానా గరిష్ఠంగా 50 శాతానికి పరిమితం.
ఇప్పటికే WTC పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న పాకిస్థాన్, తాజా కోతతో మరింత దారుణ పరిస్థితిలోకి వెళ్లింది. ఈ WTC సైకిల్లో తొమ్మిది టెస్టులు, నాలుగు సిరీస్ల తర్వాత ఆ జట్టు పాయింట్స్ పర్సెంటేజ్ 4.63కి పడిపోయింది. దీంతో WTC ఫైనల్కు చేరే అవకాశం దాదాపుగా లేనట్లే.
చదవండి: ఇంగ్లండ్దే మూడో టెస్టు.. పాకిస్తాన్ క్లీన్స్వీప్


