source: X
షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్ 2026 విజేతగా అమృత్సర్ సూర్మాస్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో లూధియానా లయన్స్పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్ను కైవసం చేసుకుంది.
టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న అమృత్సర్.. లూధియానా బ్యాటర్లను కట్టడి చేసింది. సూర్మాస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో లూధియానా భారీ స్కోరు చేయలేకపోయింది. ఒక దశలో లూధియానా జట్టు 86 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.
మయాంక్ మాయాజాలం
అమృత్సర్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు మిగతా బౌలర్లు కూడా క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో లూధియానా జట్టు 20 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటైంది.
లూధియానా ఇన్నింగ్స్లో అభిజిత్ గార్గ్ (37), హరీశ్ కుమార్ (22), మాధవ్ సింగ్ (21) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.
అనంతరం 143 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని అమృత్సర్ సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ సహజ్ ధవన్ (63) అజేయ అర్ద సెంచరీతో ఆ జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి రాహుల్ కుమార్ (42 నాటౌట్), కెప్టెన్ నమన్ ధిర్ (29) సహకరించారు. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన నమన్ ధిర్కు (10 మ్యాచ్ల్లో 655 పరుగులు, 2 సెంచరీలు) ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించింది.
చదవండి: ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కిన పాక్ టీ20 కెప్టెన్


