source: BCCI X
2026 ఏషియన్ గేమ్స్లో భారత పురుషుల క్రికెట్ జట్టు మ్యాచ్ల సమయాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పురుషుల నాకౌట్ మ్యాచ్ల్లో కొన్ని మ్యాచ్లను అరగంట ముందుకు మార్చారు. రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం, మధ్యాహ్నం జరగాల్సిన మ్యాచ్లు ఇకపై స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతాయి. గతంలో ఈ మ్యాచ్లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండింది. మహిళల క్రికెట్ మ్యాచ్ల సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.
సెప్టెంబర్ 28న తొలి మ్యాచ్
ఐచి-నగోయా (జపాన్) వేదికగా జరిగే ఏషియన్ గేమ్స్లో భారత పురుషుల జట్టుకు నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ లభించింది. సెప్టెంబర్ 28న జరిగే రెండో క్వార్టర్ ఫైనల్లో భారత్ బరిలోకి దిగనుంది.
ఈ మ్యాచ్ జపాన్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత్ కంటే జపాన్ 3 గంటల 30 నిమిషాలు ముందుండటంతో.. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 10 గంటలకు మొదలవుతుంది.
అలాగే అక్టోబర్ 1న జరిగే రెండో సెమీఫైనల్, అక్టోబర్ 3న జరిగే గోల్డ్ మెడల్ మ్యాచ్ కూడా మధ్యాహ్నం 1.30 గంటలకే ప్రారంభం కానున్నాయి. భారత్ సెమీఫైనల్కు చేరితే ఆ మ్యాచ్ కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది.
జపాన్లో ముందుగానే చీకటి పడటమే కారణం
మ్యాచ్ల సమయాలను మార్చడానికి ప్రధాన కారణం జపాన్లో త్వరగా చీకటి పడటమేనని సమాచారం. మ్యాచ్లు జరిగే వేదికలో ఫ్లడ్లైట్లు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పురుషుల మ్యాచ్లు సాధారణంగా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉండటంతో.. చీకటి పడేలోపు మ్యాచ్లను పూర్తి చేసేందుకు ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం.
ముందుగా మరో మ్యాచ్
ఏషియన్ గేమ్స్లో తమ తొలి అధికారిక పోటీకి ముందు భారత్ ఆతిథ్య జట్టు జపాన్తో ఓ టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 22న సానో ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఇదీ చదవండి: ఇషాన్ గాయంపై అప్డేట్ ఇచ్చిన శ్రేయస్


