source: X
ఇటీవల పాకిస్తాన్ క్రికెట్లో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల్లో టెస్ట్ జట్టుకు దూరమైన ఆ దేశ టీ20 కెప్టెన్ సల్మాన్ అలీ అఘా, స్థానికంగా జరిగిన ఓ దేశవాలీ మ్యాచ్లో అజేయ ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కాడు.
ప్రెసిడెంట్స్ ట్రోఫీలో కింగ్స్మెన్ అకాడమీ తరఫున బరిలోకి దిగిన అతడు, మార్కోర్ ఐటీ సొల్యూషన్స్ జట్టుపై 336 బంతుల్లో 42 బౌండరీలు, 6 సిక్సర్ల సాయంతో 300 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అఘా ట్రిపుల్ సెంచరీతో చెలరేగడంతో అతడి జట్టు భారీ స్కోర్ చేసింది.
ఈ ట్రిపుల్తో అఘా పాక్ జాతీయ సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటన నుంచి అర్దంతరంగా స్వదేశానికి పంపిన ఏడుగురు పాక్ ఆటగాళ్లలో అఘా ఒకడు.
ఇంగ్లండ్ పర్యటనలో తొలి రెండు టెస్ట్ల ఓటముల తర్వాత అఘాతో పాటు మహ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, అవైస్ జాఫర్, ఖుర్రమ్ షహజాద్ను జట్టు నుంచి తొలగించి స్వదేశానికి పంపించారు. అలాగే హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్ను కూడా బృందం నుంచి తప్పించారు.
రెగ్యులర్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అందుబాటులో లేకపోవడంతో లీడ్స్లో జరిగిన తొలి టెస్టుకు అఘానే కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే పేలవ ఫామ్ కారణంగా రెండో టెస్టులో అతడికి అవకాశం దక్కలేదు. ఇక, మూడో టెస్టుకు ముందు జరిగిన పరిణామాల్లో అఘాను ఏకంగా స్క్వాడ్ నుంచే విడుదల చేశారు.
జట్టు నుంచి తప్పించిన రోజుల వ్యవధిలోనే అఘా ట్రిపుల్ సెంచరీ బాదడం పాక్ క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. అతడిని తిరిగి టెస్ట్ జట్టులోకి తీసుకోవాలని పాక్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
అఘాకు పీసీబీ ఛైర్మన్ నఖ్వీ కూడా మద్దతుగా నిలిచాడు. అఘా మంచి ఆటగాడే కానీ, కొన్ని కారణాల వల్ల ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడని అన్నాడు. కాగా, ఇంగ్లండ్ పర్యటనలో ఘోరంగా విఫలమైన పాక్ జట్టు 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 0-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే.
చదవండి: పాకిస్తాన్కు మరో భారీ షాక్


