దుబాయ్: మహిళల ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత మహిళల జట్టు.. ట్రోఫీ అందుకునే సమయంలో మాత్రం వేదిక వద్దకు రాలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు భారత జట్టు నిరాకరించినట్లు సమాచారం. దీంతో గతేడాది పురుషుల ఆసియా కప్ ఫైనల్లో చోటుచేసుకున్న పరిస్థితే మరోసారి కనిపించింది.
అయితే, హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు మ్యాచ్ అనంతరం ఎప్పటిలాగే సంబరాలు చేసుకుంది. ప్రసార సంస్థకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. సాధారణంగా మ్యాచ్ ముగిసిన 15–20 నిమిషాల్లో బహుమతుల ప్రదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయితే ఈసారి గంటకుపైగా ఆలస్యమైంది. ఈ సమయంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆటగాళ్లతో మైదానం పక్కన మాట్లాడారు. డ్రెస్సింగ్ రూమ్లోనే జట్టు సభ్యులకు పతకాలు అందజేసినట్లు సమాచారం.
ఏసీసీ అధ్యక్షుడి హోదాలో మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీని అందజేసేందుకు స్టేడియానికి వచ్చినట్లు పాకిస్థాన్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. రన్నరప్గా నిలిచిన శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపత్తుకు ఆయన బహుమతి చెక్కును అందజేశారు. అయితే భారత జట్టు, కోచ్, అధికారులు ట్రోఫీ ప్రధాన వేదిక వద్ద కనిపించలేదు. దీంతో భారత జట్టు ట్రోఫీని తీసుకోకపోతే దానిని మరోసారి ఏసీసీ కార్యాలయానికి తీసుకెళ్లే అవకాశం ఉందని పాకిస్థాన్ మీడియా పేర్కొంది.
గతేడాది పురుషుల ఆసియా కప్ ఫైనల్లోనూ ఇదే తరహా పరిణామం చోటుచేసుకుంది. భారత్ టైటిల్ గెలిచిన తర్వాత మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు భారత జట్టు నిరాకరించింది. మరో ఏసీసీ లేదా ఐసీసీ అధికారి చేతుల మీదుగా ట్రోఫీ అందజేయాలని కోరింది. అయితే నఖ్వీ అందుకు అంగీకరించకపోవడంతో అప్పట్లో బహుమతి ప్రదాన కార్యక్రమం వద్ద ప్రతిష్టంభన ఏర్పడింది. చివరకు ఆయన ట్రోఫీని తీసుకుని ఏసీసీ కార్యాలయానికి వెళ్లారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్–పాకిస్థాన్ సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న సమయంలో గతేడాది ఆసియా కప్లో భారత జట్టు పాకిస్థాన్తో మ్యాచ్ల సందర్భంగా సంప్రదాయ హ్యాండ్షేక్కు దూరంగా ఉంది. ఈ నేపథ్యంలోనే నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడాన్ని భారత జట్టు వ్యతిరేకించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. నఖ్వీ పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా చేసిన గత వ్యాఖ్యలు కూడా దీనికి కారణమని కథనాలు పేర్కొన్నాయి. తాజాగా మహిళల ఆసియా కప్ ఫైనల్లోనూ దాదాపు అదే పరిస్థితి కనిపించడంతో ట్రోఫీ ప్రదానంపై మరోసారి చర్చ మొదలైంది.
ఇదీ చదవండి: పోలాండ్ సరిహద్దుకు 2 కి.మీ. దూరంలో రష్యా డ్రోన్ దాడి


