వరదల నష్టంపై నేపాల్ ప్రభుత్వం అంచనా
కఠ్మాండు: ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలతో వాటిల్లిన నష్టాల నుంచి కోలుకునేందుకు, పునరి్నర్మాణ పనుల కోసం సుమారు రూ.45 వేల కోట్లు (సుమారు 4.78 బిలియన్ డాలర్లు) అవసరమవుతాయని నేపాల్ ప్రభుత్వం అంచనా వేసింది.
ఆగస్ట్ 26న వచ్చిన విధ్వంసకర వరదల్లో రోడ్లు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు, వేలాదిగా గృహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మౌలిక వసతుల పునరుద్ధరణతో పాటు భవిష్యత్తులో వచ్చే విపత్తులను తట్టుకునేలా పునర్నిర్మాణ చర్యలు చేపట్టడానికి ఈ నిధులు అవసరమని నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ నివేదిక పేర్కొంది.
ది ర్యాపిడ్ డ్యామేజ్ అండ్ నీడ్స్ అసెస్మెంట్(ఆర్డీఎన్ఏ) ఫర్ ది రసువా–భోటెకోషి ఫ్లడ్–2026 పేరుతో ఆదివారం ఈ నివేదికను విడుదల చేసింది. వరదలతో మొత్తం నష్టం సుమారు రూ.25 వేల కోట్లు కాగా, ఇందులో భౌతిక నష్టం రూ.17 వేల కోట్లు, ఆర్థిక నష్టాలు సుమారు రూ.8 వేల కోట్లని పేర్కొంది. ఈ పునరుద్ధరణ అంచనా కేవలం దెబ్బతిన్న వాటిని పునరుద్ధరించడానికి అయ్యే వ్యయం మాత్రమే కాదు.
విపత్తు ప్రమాదాలను తగ్గించేందుకు, భవిష్యత్తు విపత్తులను తట్టుకునే రక్షణ చర్యలు కూడా కలిసి ఉన్నాయని వివరించింది. ఇలా ఉండగా, నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మరికొన్ని మృతదేహాలు బయటపడటంతో చనిపోయిన వారి సంఖ్య 1,388కు చేరుకున్నట్లు ఆదివారం అధికారులు తెలిపారు. మృతదేహాల్లో ఇప్పటి వరకు 104 మాత్రమే గుర్తించి, సంబం«దీకులకు అందజేశామన్నారు. వరదల్లో గల్లంతైన వారి సంఖ్య 5,130గా ఉందని చెప్పారు.


