ఇల్లు పోయి, పిల్లలూ అదృశ్యం.. చిన్నారులు దొరికినా నరకయాతన | Nepal Flash floods mothers struggle | Sakshi
Sakshi News home page

ఇల్లు పోయి, పిల్లలూ అదృశ్యం.. చిన్నారులు దొరికినా నరకయాతన

Sep 7 2026 3:25 PM | Updated on Sep 7 2026 3:58 PM

Nepal Flash floods mothers struggle

కాఠ్మాండు: నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదలు, కొండచరియల విరిగిపడటంతో ఇల్లు కోల్పోయి సహాయక శిబిరాల్లో తలదాచుకున్న తల్లులు, శిశువులు ఎదుర్కొంటున్న బాధలు వర్ణనాతీతం. వరదల్లో తల్లి నుంచి బిడ్డలు విడిపోవడం, తిరిగి కలిసిన తర్వాత కూడా వారికి సరైన ఆహారం, ప్రశాంతమైన వాతావరణం లేకపోవడం వంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి.

వరదల కారణంగా వేలాది మంది నిరాశ్రయులై తాత్కాలిక శిబిరాల్లో జీవిస్తున్నారు. ముఖ్యంగా బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు ప్రత్యేక అవసరాలు అందడం లేదు. శిశువులకు ప్రత్యేక ఆహారం లేక పెద్దలకు ఇచ్చే ఆహారాన్నే తినిపించాల్సి వస్తోంది. రద్దీగా ఉన్న శిబిరాల్లో తల్లులు బిడ్డలకు పాలు పట్టించుకోవడానికి కూడా గోప్యత లేక ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు గర్భిణులు ఆసుపత్రులకు చేరుకోవడంలో రహదారులు దెబ్బతినడం, విద్యుత్‌ అంతరాయం, వైద్య సదుపాయాల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.  

పిల్లలు దొరికినా ఆహారం లేదు 
నేపాల్‌లో వచ్చిన వరదల‍్లో షర్మిలా శ్రేష్ఠ (33) అనే మహిళ ఇల్లు కొట్టుకుపోయింది. ఆమె కొన్ని రోజుల పాటు తన కుమార్తె నుంచి దూరమైంది. ఇప్పుడు తన కుమార్తెతో తిరిగి కలిసిన ఆమె.. రద్దీగా ఉన్న ఆశ్రయ కేంద్రంలో పెద్దలకు ఇచ్చే ఆహారాన్నే తన చిన్నారికి తినిపిస్తూ నిస్సహాయంగా చూస్తోంది. 14 నెలల వయసున్న ఆమె కుమార్తె, తన వదినకు చెందిన 18 నెలల కుమారుడితో కలిసి వాయవ్య కాఠ్మాండులోని ఓ తరగతి గది నేలపై నిద్రిస్తోంది. ఆ ఇద్దరు చిన్నారులకు ప్రత్యేకమైన శిశు ఆహారం అందడం లేదు.

“శిశువులకు ప్రత్యేకమైన ఆహారం ఇవ్వడం లేదు. ఆ చిన్నారికి కూడా పెద్దలకు ఇచ్చే గట్టి ఆహారాన్నే తినిపించాల్సి వస్తోంది” అని శ్రేష్ఠ చెప్పారు. వరదల కారణంగా తన కుమార్తె నుంచి విడిపోయిన తర్వాత ఆమెను వెతుక్కుంటూ కొండల మార్గంలో 6 గంటలు నడిచింది. వరదల కారణంగా వారిద్దరూ 2 లేదా 3 రోజుల పాటు విడిపోయారు. “నాకు కావాల్సిందల్లా సురక్షితమైన, సరైన నివాసం. అది ఉంటే కొంత మనశ్శాంతి కలుగుతుంది” అని ఆమె చెప్పింది.

గర్భిణులకు ఏదైనా సమస్య వస్తే? 
ఆగస్టు 26న నేపాల్‌లో వచ్చిన ఆకస్మిక వరదలు శ్రేష్ఠ వంటి తల్లులకు మరో సంక్షోభాన్ని తెచ్చిపెట్టాయి. పెరుగుతున్న వరద నీటిలోనే కాకుండా, రద్దీగా ఉన్న ఆశ్రయ కేంద్రాల్లో, పిల్లలకు ఆహారం ఇచ్చే సమయంలో, తరగతి గదుల నేలపై, ఆసుపత్రులకు వెళ్లే ప్రమాదకరమైన మార్గాల్లో ఈ సంక్షోభం కొనసాగుతోంది. చిన్నారులు ఆకలితో ఉన్నారు. తల్లులు పిల్లలకు పాలివ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. గర్భిణులు ఏదైనా సమస్య వస్తే ఆసుపత్రికి చేరుకోగలమా అనే ఆందోళనలో ఉన్నారు.

వందలాది మంది నిరాశ్రయులతో నిండిన ఆశ్రయ కేంద్రాల్లో పిల్లలకు పాలు పట్టించడానికి, వారిని ఓదార్చడానికి అవసరమైన ప్రశాంతమైన, ఏకాంతమైన ప్రదేశం కూడా లేదు. ట్రిశూలిలో తన నవజాత శిశువుకు 3 నెలలుగా పాలిస్తున్న పరివార్‌ అనే మహిళ ఆగస్టు 26న వరద నీరు ఉద్ధృతంగా రావడంతో ఇంటి నుంచి బయటకు వచ్చింది.

ఇప్పుడు భోటేకోశి-ట్రిశూలి మార్గంలో ఉన్న ఓ ఆశ్రయ కేంద్రంలో ఆమె తన బిడ్డకు పాలు ఇస్తోంది. అక్కడ డజన్ల కొద్దీ అపరిచితులు ఉన్నారు. సమీపంలో పురుషులు సిగరెట్లు తాగుతున్నారు. మద్యం వాసన కూడా వస్తోంది. “అందరం ఒకే చోట ఉన్నాం. అందుకే చాలా కష్టంగా ఉంది. సిగరెట్‌ పొగ, మద్యం వాసన ఉన్నాయి. బిడ్డ నిద్రపోలేకపోతోంది” అని తన ఇంటిపేరుతో మాత్రమే గుర్తించాలని కోరిన పరివార్‌ చెప్పింది.

వరదల తర్వాత ఆమెకు రొమ్ము పాలు తగ్గిపోయాయి. ఆమె పాలపొడిని ప్రయత్నించింది. అయితే అది శిశువు కడుపుకు ఇబ్బంది కలిగించినట్లు కనిపించింది. దాంతో పాలు తాగిన తర్వాత శిశువు మరింతగా ఏడుస్తోంది. “సురక్షితమైన ప్రదేశం ఉండి, ఇక్కడే బిడ్డకు టీకాలు వేయగలిగితే బాగుంటుంది. మాకు సమయానికి ఆహారం కూడా అందడం లేదు. తినడానికి సరిపడా ఆహారం లభించడం లేదు” అని పరివార్‌ చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement