సాక్షి, న్యూఢిల్లీ: గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఓ బైకర్ను కారు వెంబడించి ఢీకొట్టిన ఘటన కలకలం రేపింది. సియా అనే యువతి ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్పై వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు ఆమె సోదరుడు తెలిపారు. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారని, వారు మద్యం మత్తులో ఉన్నట్లు ఆయన ఆరోపించారు.
సియా తెలిపిన వివరాల ప్రకారం.. ఆమెతో పాటు మరికొందరు బైకర్లు రోడ్డుపై వెళ్తుండగా ఓ కారు వెనుక నుంచి వారిని అనుసరించింది. దాంతో కారు దూరంగా ఉండాలని సైగ చేసినప్పటికీ, అది ఆమె బైక్ వైపు వచ్చి ఢీకొట్టినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ఆమెను కారు ఢీకొనడంతో సియా బైక్ నుంచి కిందపడిపోయింది. ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. న్యాయవాది కూడా పోలీస్ అధికారులను కలిసి చర్యలు తీసుకోవాలని కోరినట్లు సియా సోదరుడు తెలిపారు.
అయితే, కారు డ్రైవర్ మాత్రం మరోలా చెప్పాడు. యూటర్న్ వద్ద కారు అదుపుతప్పడంతోనే బైక్ను తాకిందని, కావాలని ఢీకొట్టలేదని పేర్కొన్నాడు. అలాగే, తాను బైకర్ అక్కడ ఉన్న విషయాన్ని సరిగ్గా గమనించలేదని చెప్పాడు.
ఆ సమయంలో రోడ్డుపై సుమారు 20 నుంచి 22 మంది బైకర్లు ఉన్నారని డ్రైవర్ తెలిపాడు. వారిని నెమ్మదిగా వెళ్లాలని మాత్రమే సూచించానని, ఎలాంటి అసభ్యకర సైగలు చేయలేదని, కారు ఆపితే బైకర్లు తనపై దాడి చేస్తారనే భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయానని డ్రైవర్ చెప్పాడు. మరోవైపు ఈ ఘటనపై సియా కుటుంబం మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
సియాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్, బైకర్ చెప్పిన విషయాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి: నాలుగేళ్ల తర్వాత బీజేపీ కార్యకర్త అస్థిపంజరం వెలికితీత


