సాక్షి, అనంతపురం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న షెడ్ను ఢీకొట్టి ఓ హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అందులో ఉన్న ఓ యువతి అక్కడికక్కడే మరణించగా.. మరో యువతి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లింది. ఇద్దరు యువకులకు గాయాలవ్వడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద ఉదయం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తాడిపత్రి నుంచి అనంతపురం వస్తున్న టాటా సఫారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న షెడ్ను ఢీకొట్టి.. అక్కడి హోటల్లోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని గుత్తికి చెందిన హరితగా పోలీసులు గుర్తించారు.

అనంతపురం హౌసింగ్ బోర్డుకు చెందిన శ్రీధర్రెడ్డి, సింగనమల మండలం సలకం చెరువుకు చెందిన కుమార్, గుత్తికి చెందిన హరితతో పాటు మరో యువతి ప్రమాద సమయంలో కారులో ఉన్నారు. మరో యువతి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. ఇద్దరు యువకులకు కూడా గాయాలు కావడంతో వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో కారు ఎందుకు అదుపుతప్పిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్కు నిద్రమత్తు వచ్చిందా? లేదంటే మద్యం సేవించి వాహనం నడిపారా? అనే కోణాల్లోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


