రియాద్: యెమెన్లో హౌతీలు విజృంభిస్తున్న నేపథ్యంలో సౌదీ అలర్టయ్యింది. ఆ నేపథ్యంలోనే తొలిసారిగా రాజధాని రియాద్లో హెచ్చరికలు జారీ చేసింది. శనివారం తెల్లవారుజామున రియాద్లో వైమానిక దాడి హెచ్చరిక జారీ అయింది. ఆ ప్రాంతంలోని పౌరులకు వైమానిక దాడుల ముప్పు ఉందని ఇళ్లలోనే ఉండాలని అధికారులు సందేశాలు పంపారు. కొద్దిసేపటికే రెండు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో నగర ప్రజల్లో ఆందోళన వాతావరణం నెలకొంది.
యెమెన్లో సౌదీ అరేబియా మద్ధతిస్తున్న ప్రభుత్వ బలగాలకు అక్కడి హౌతీలకు తీవ్రంగా యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో హౌతీలు వేగంగా దాడులు చేస్తూ భారీగా భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో వారి పట్టు పెరగడం సౌదీ అరేబియాకు ఆందోళన కలిగిస్తోంది. గతంలో హౌతీలపై సౌదీ అరేబియా అనేక వైమానిక దాడులు చేసినప్పటికీ వారి పురోగతిని పూర్తిగా అడ్డుకోలేకపోయింది. తాజా పరిణామాల నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. హౌతీలు తమపై దాడి చేసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేసింది.
మక్కాపై దాడి ఆరోపణ
ఇటీవల మక్కాపై హౌతీలు దాడి చేశారని సౌదీ అరేబియా ఆరోపించగా, హౌతీలు ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. రియాద్లో జారీ చేసిన తాజా హెచ్చరికకు ముప్పు ఎక్కడి నుంచి వచ్చిందో సౌదీ అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. అయితే యెమెన్లో కొనసాగుతున్న పోరాటం కారణంగా ఇప్పటివరకు 1.12 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
యెమెన్లోని ఎర్ర సముద్ర తీర ప్రాంతాలపై హౌతీల నియంత్రణ పెరగడం వల్ల అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో సౌదీ అరేబియా తన రక్షణ సామర్థ్యాలను పెంచుకునే చర్యల్లో భాగంగా అమెరికా నుంచి 48 ఎఫ్-35 యుద్ధ విమానాల కొనుగోలుకు 24.3 బిలియన్ డాలర్ల ఒప్పందానికి అనుమతి పొందింది. అమెరికా సహాయం కోరినప్పటికీ, హౌతీలపై నేరుగా దాడులు చేయడానికి అమెరికా నిరాకరించినట్లు సమచారం వచ్చింది.


