భారత్‌కు బంగ్లాదేశ్‌ ప్రధాని తారిఖ్‌ రహ్మాన్‌? ఇక విభేదాలన్నీ.. | Bangladesh PM Tarique Rahman to visit India | Sakshi
Sakshi News home page

భారత్‌కు బంగ్లాదేశ్‌ ప్రధాని తారిఖ్‌ రహ్మాన్‌? ఇక విభేదాలన్నీ..

Sep 19 2026 7:18 PM | Updated on Sep 19 2026 7:30 PM

 Bangladesh PM Tarique Rahman to visit India

బంగ్లాదేశ్‌ ప్రధాని తారిఖ్‌ రహ్మాన్‌ భారత్‌ పర్యటనకు సంబంధించి ఢిల్లీ, ఢాకా మధ్య అధికారికంగా చర్చలు మళ్లీ ప్రారంభమైనట్లు సమాచారం. నవంబర్‌లో ఆయన న్యూఢిల్లీ పర్యటనకు సమయాన్ని ఖరారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని జాతీయ మీడియా తెలిపింది.

ఢాకాలో ఇరు దేశాల అధికారులు సమావేశాలు నిర్వహిస్తూ పర్యటనకు సంబంధించిన అంశాలను చర్చిస్తున్నట్లు దౌత్య వర్గాలు తెలిపాయి. ఈ నెలలో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ కోసం తారిఖ్‌ రహ్మాన్‌ న్యూయార్క్‌ వెళ్లాల్సి ఉంది. అనంతరం అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో ఆయనకు పలు దౌత్యపరమైన కార్యక్రమాలు ఉండనున్నాయి. వీటి మధ్యలో నవంబర్‌లో న్యూఢిల్లీ పర్యటనకు అనువైన తేదీని ఖరారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రతిపాదిత పర్యటనలో భారత్‌-బంగ్లాదేశ్‌ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధారణ స్థితికి తీసుకురావడం, రెండు దేశాల మధ్య సంబంధాలపై చర్చించడం, గంగా జలాల ఒప్పందం పునరుద్ధరణ వంటి అంశాలు ఎజెండాలో ఉండే అవకాశం ఉందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. 1996లో కుదిరిన గంగా జలాల పంపిణీ ఒప్పందం 2026 డిసెంబర్‌లో ముగియనుంది.

ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశానికి తారిఖ్‌ రహ్మాన్‌ హాజరుకాలేదు. బంగ్లాదేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం ఆయనకు ఆహ్వానం ప్రధానమంత్రిగా కాకుండా బిమ్స్‌టెక్‌ చైర్‌గా వచ్చింది. మరోవైపు, బంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్‌ కోబిర్‌ భారత్‌తో సంబంధాలను “రీ-సెట్‌” చేసేందుకు అనుకూల వాతావరణంలో ద్వైపాక్షిక పర్యటన జరగాలని గతంలో పేర్కొన్నారు. అయితే పర్యటన తేదీపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. ఇరు దేశాల మధ్య చర్చలు ముందుకు సాగితే నవంబర్‌లో తారిఖ్‌ రహ్మాన్‌ పర్యటన ఖరారయ్యే అవకాశంపై స్పష్టత రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement