ఉత్కంఠకు తెర పడింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేసే బిల్లుపై ట్రంప్ ఇవాళ సంతకం చేశారు. ఈ బిల్లు చట్టంగా మారడంతో ఆయా దేశాలపై ఏ క్షణమైనా 100 శాతం వరకు టారిఫ్లు ట్రంప్ విధించే అవకాశం ఉంది. ప్రధానంగా.. భారత్, చైనాలకు ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది.
లిండ్సే గ్రాహం యాక్ట్ ప్రకారం.. రష్యా నుంచి అత్యధికంగా క్రూడ్ ఆయిల్ లేదంటే గ్యాస్ దిగుమతి చేసుకునే టాప్-5 దేశాల నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై 100 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉంది. అయితే చట్టంలో ఆ దేశాల పేర్లను ప్రత్యేకంగా పేర్కొనలేదు. ఆయా జాబితాలను ఎలా లెక్కించాలన్న దానిపైనా పూర్తి స్పష్టత లేదు. దీంతో తుది నిర్ణయాధికారం ట్రంప్ ప్రభుత్వానికే దక్కింది.
అబ్ ఆయేగా అస్లీ మజా!
ట్రంప్ సంతకం చేయడంతో ఇప్పటివరకు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. కానీ అసలు పరిణామాలు ఇప్పుడే మొదలుకానున్నాయి. భారత్, చైనా సహా రష్యా చమురు కొనుగోలు చేస్తున్న ఏ దేశాలు ‘టాప్-5’ జాబితాలోకి వస్తాయి? వాటిపై ట్రంప్ 100 శాతం వరకు టారిఫ్ విధిస్తారా? లేక మినహాయింపు ఇస్తారా? అన్నదే ఇప్పుడు కీలకం. తుది జాబితా, టారిఫ్ స్థాయిపై అమెరికా ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ఆగస్టు క్రూడ్ దిగుమతుల డేటా ఆధారంగా రష్యా చమురు కొనుగోలులో ముందున్న దేశాలు:
భారత్
చైనా
ఇటలీ
టర్కీ
నెదర్లాండ్స్
ఎస్అండ్పీ గ్లోబల్ ప్రకారం ఆగస్టులో రష్యా క్రూడ్ దిగుమతుల్లో భారత్ రోజుకు సుమారు 16 లక్షల బ్యారెళ్లతో మొదటి స్థానంలో ఉండగా, చైనా 11 లక్షల బ్యారెళ్లతో తర్వాతి స్థానంలో ఉంది. ఇటలీ, టర్కీ, నెదర్లాండ్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
భారత్కు ఎందుకు కీలకం?
రష్యా నుంచి చౌకగా లభించే క్రూడ్ ఆయిల్ భారత రిఫైనరీలకు కీలక వనరుగా మారింది. దేశీయ అవసరాల్లో భారీ భాగం దిగుమతులపైనే ఆధారపడుతోంది. రష్యా చమురు దిగుమతులు భారత మొత్తం క్రూడ్ దిగుమతుల్లో దాదాపు సగం వరకు ఉన్నాయని తాజా విశ్లేషణలు పేర్కొంటున్నాయి. దీంతో రష్యా నుంచి కొనుగోళ్లపై అమెరికా చర్యలు తీసుకుంటే భారత రిఫైనింగ్ రంగంతో పాటు అమెరికాకు ఎగుమతి చేసే భారతీయ ఉత్పత్తులపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.
అయితే భారత్ సహా ఏ దేశాలపై, ఎప్పుడు, ఎంతమేర సుంకాలు విధించాలన్న విషయంలో ట్రంప్దే తుదినిర్ణయం కానుంది. మరోవైపు ఈ విషయంలో అమెరికాతో చర్చలు జరుగుతున్నాయని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది.
చర్చల్లో మరికొన్ని దేశాలు
రష్యా చమురు కొనుగోలుదారుల జాబితాతో పాటు రష్యా ఆంక్షలను తప్పించుకునేందుకు సహకరిస్తున్న దేశాలపైనా చట్టం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో బ్రెజిల్, జపాన్, యూరోపియన్ యూనియన్లోని కొన్ని దేశాలు కూడా అమెరికా చర్యల పరిధిలోకి రావచ్చనే చర్చ జరుగుతోంది.
30 రోజుల్లో నిర్ణయం?
కొత్త చట్టం ప్రకారం అర్హత కలిగిన దేశాలపై టారిఫ్లు విధించే చర్యలను 30 రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో నవంబర్లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు ఈ అంశం కీలకంగా మారింది. రష్యా చమురుపై ఆంక్షలు కఠినతరం చేస్తే ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడి ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో అమెరికాలో వినియోగదారులపై ఇంధన ధరల భారం పెరగకుండా ట్రంప్ ప్రభుత్వం ఈ అధికారాలను ఎంతవరకు ఉపయోగిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
రష్యాపై మరింత ఒత్తిడి
ఈ చట్టం కేవలం చమురు కొనుగోలుదారులపైనే కాదు.. రష్యా ఇంధన, రక్షణ రంగాలతో పాటు ఆంక్షలను తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘షాడో ఫ్లీట్’ ట్యాంకర్లపైనా చర్యలకు వీలు కల్పిస్తోంది. ఇరాన్పై ఉన్న కొన్ని ఆంక్షలను కూడా ఈ చట్టం పొడిగించింది. ఉక్రెయిన్పై యుద్ధానికి రష్యాకు లభిస్తున్న ఆర్థిక వనరులను దెబ్బతీయడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా అమెరికా పేర్కొంటోంది.
మొత్తంగా చూస్తే.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలకు ఇది నేరుగా తాకే అంశమే అయినప్పటికీ, 100 శాతం టారిఫ్ ఇప్పటికిప్పుడు ఖరారైన నిర్ణయం కాదు. ఏ దేశాలను తుది జాబితాలో చేర్చుతారు? భారత్పై ఎంత మేర ప్రభావం ఉంటుంది? అన్నది ట్రంప్ ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.
ఇదీ చదవండి: భూకంపం కాదు.. భూకంపాలు పుట్టిన కిమ్


