జెన్–జీ యువతతో ఆర్ఎస్ఎస్ చీఫ్
ఉజ్జయిని: ‘ధర్మం’పై భారతీయుల అవగాహనకు, పాశ్చాత్యుల ‘మతం’అన్న ఆలోచనకు మధ్య చాలా తేడా ఉందని ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భాగవత్ అభిప్రాయపడ్డారు. వివిధ విశ్వాసాల పట్ల వివక్ష చూపకపోవడాన్నే భారతదేశం మతసామరస్యంగా పరిగణించిందని ఆయన వ్యాఖ్యానించారు. అహంకారం, ఈగోలు ప్రకృతి సహజ నియమాలను కూడా నియంత్రించగలనన్న మనిషి అపోహకు కారణమవుతుందని హెచ్చరించారు.
ఉజ్జయినిలో శుక్రవారం సుమారు 1700 మంది జెన్–జీ యువతతో ఏర్పాటు చేసిన ‘యువ ధర్మ సంసద్’ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘ధర్మం’అనేది వృద్ధులకు సంబంధించింది అనుకుంటున్న పరిస్థితుల్లో యువత గురించి చర్చించడం సంతోషంగా ఉందని అన్నారు. ‘‘భారత్లో సంస్కృతుల మేళవింపు నిత్యం జరుగుతూనే ఉంటుంది. ప్రజల మధ్య వివక్ష చూపదు. పంత్ నిరపేక్షత అర్థం ఇదే’’అని ఆయన చెప్పారు. వ్యక్తుల దర్పం, గర్వం అన్నీ తన నియంత్రణలోనే ఉన్నాయన్న తప్పుడు భావనను కల్పిస్తాయని వ్యాఖ్యానించారు.
పాశ్చాత్య దేశాల్లో పాలకులు, మతాధికారుల మధ్య ఘర్షణలు సెక్యులరిజమ్ అన్న భావనకు కారణమైందని, కాబట్టి అది మన దేశ సందర్భానికి తగింది కాదని చెప్పారు. జీవితపు భౌతిక, ఆధ్యాత్మిక అంశాలను ఒక్కటిగా చూడటం భారతీయుల సంస్కృతి అన్నారు. ధర్మం అనేది మతాల కంటే ఉన్నతస్థాయిదని, రెండింటినీ ఒకేలా చూడకూడదని చెప్పారు.
ధర్మం మోక్షానికి దారినిస్తే... మతం బంధాలకు కారణమవుతుందన్నారు. ఇంగ్లి్లషు భాషలో ధర్మం అనే భారతీయ భావనకు తగిన పదమే లేదని పాశ్చాత్యులకు దీన్ని వివరించేందుకు ‘మతం’అన్న పదాన్ని వాడారని తెలిపారు. ధర్మం నుంచి మతాన్ని వేరు చేస్తే అది విభజనకు దారితీసే అవకాశముంటుందని అన్నారు.
సత్యం, సానుభూతి, స్వచ్ఛత, స్వీయ క్రమశిక్షణలే ధర్మానికి ఆధారమని వివరించారు. ‘ధర్మం’అంటే విశ్వాసాన్ని నిలబెట్టే, అందరి అభివృద్ధిని ప్రోత్సహించే, ప్రతి జీవి, వస్తువు స్వభావాన్ని పరిగణనలోకి తీసుకొని కర్తవ్యాలను నిర్ణయించే సూత్రమని అన్నారు. అలాగే ఆయన ‘ధర్మం’ను పర్యావరణ బాధ్యతతో కలిపారు. ప్రకృతిని రక్షించడం మానవుల కర్తవ్యమని, అడవులను నాశనం చేయడం పర్యావరణ అసమతౌల్యం, ‘అధర్మం’అవుతుందని అన్నారు. యువత ధర్మాన్ని అర్థం చేసుకునేందుకు ముందస్తు ఆలోచనలను పక్కనబెట్టాలని సూచించారు. సొంత సంప్రదాయాలకు కట్టుబడి ఉంటూనే.. ఇతర ప్రార్థన పద్ధతులను గౌరవించాలని కోరారు.


