ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులకు మనదేశం నుంచి ఊహించని చిత్రం ఎంపికైంది. దాదాపు 30కి పైగా సినిమాలు పోటీపడగా..ఇండియా నుంచి ఓ చిన్న మూవీ జాక్పాట్ కొట్టేసింది. మరాఠీలో తెరకెక్కించిన గోంధాల్ మూవీ ఎంపికైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని 99వ అకాడమీ అవార్డులకు గానూ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ ఎంపిక చేసింది.
ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్లో మై వాపస్ ఆవుంగా, బోర్డర్ 2, ధురందర్, 120 బహదూర్, సింగ్ గీతం, పెద్ది, ఇరుముడి, లాంటి సినిమాలు కూడా పోటీపడ్డాయి. ఈ చిత్రాలను వెనక్కి నెట్టి గోంధల్ అర్హత సాధించింది. ఈ లిస్ట్లో గోంధాల్ తర్వాత స్థానంలో ఇక్కీస్, అంఘ్ సినిమాలు నిలిచాయని జ్యూరీ వెల్లడించింది. గోంధాల్ మూవీ భారతీయ సంస్కృతిని చక్కగా చూపించారని..సినిమాటోగ్రఫీ, సంగీతం అద్భుతంగా ఉన్నాయని జ్యూరీ సభ్యుల్లో ఒకరు అన్నారు.
ఈ చిత్రం ఒక రాత్రంతా జరిగే జానపద ప్రదర్శన అయిన సాంప్రదాయ మహారాష్ట్ర గోంధాల్ ఆచారం నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంతో దర్శకుడు సంతోష్ దావఖర్ అరంగేట్రం చేశారు. ఇది గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. అక్కడ స్పెషల్ జ్యూరీ గుర్తింపుతో సిల్వర్ పీకాక్ అవార్డును గెలుచుకుంది. గతేడాది నవంబర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ పరిమిత వసూళ్లు మాత్రమే సాధించింది. కాగా.. 99వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 14, 2027న జరగనుంది.


