రాజ్యసభలో టీడీపీ ఎంపీల పరుష పదజాలం సరికాదు | Privilege Complaint Filed Against TDP MPs Over Rajya Sabha Remarks: YV Subba Reddy | Sakshi
Sakshi News home page

రాజ్యసభలో టీడీపీ ఎంపీల పరుష పదజాలం సరికాదు

Sep 19 2026 3:40 AM | Updated on Sep 19 2026 3:40 AM

Privilege Complaint Filed Against TDP MPs Over Rajya Sabha Remarks: YV Subba Reddy


సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: గత పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో రా­జ్యసభలో టీడీపీ ఎంపీలు సానా సతీష్  బాబు, చింతకాయల విజయ్‌ పరుష పదజా­లం ఉపయోగించడంపై వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. వారి తీరు సరికాదని రాజ్యసభ చైర్మన్‌కు, ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేశారు. రాజ్యసభలో జూలై 30న పబ్లిక్‌ ఎ­గ్జామినేషన్స్‌ (అన్‌ఫెయిర్‌ మీన్స్‌ నిరోధక) సవరణ బిల్లు­–2026పై చర్చ సందర్భంగా తాను ప్రసంగిస్తున్న సమయంలో సానా సతీష్ బాబు పదేపదే వైఎస్సార్‌సీపీని ఉద్దేశించి అభ్యంతరకర పదజాలం ఉపయోగించారని సు­బ్బారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరంగానే కాకుండా బెదిరింపులకు గురిచేసే వి­ధంగా ఉన్నాయని ప్రస్తావించారు. ‘నా ప్రసంగానికి అంత­రాయం కలిగించి, ఆలోచనాక్రమాన్ని దెబ్బతీసి, నా వా­దనను సమర్థంగా వినిపించకుండా చేయడమే సానా సతీష్‌ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యల ఉద్దేశం’ అని వైవీ తెలిపారు. అలాగే, ఆగస్టు 5న సుప్రీంకో­ర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు–2026­పై చర్చ సందర్భంగా మరో టీడీపీ సభ్యుడు చింతకాయల విజయ్‌ స­భా నిబంధనలకు విరుద్ధంగా పరుష పదజాలం ఉపయో­గించారని సుబ్బారెడ్డి తన ఫిర్యాదు­లో పే­ర్కొన్నారు.

ఇది రాజ్యసభ నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టంచేశా­రు. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య అభిప్రా­య భేదాలు సహజమే అయినప్పటికీ సభలో ఒక సభ్యు­డు ప్రసంగిస్తున్నప్పుడు తోటి సభ్యులు ఎవరైనా అభ్యంతరకరమైన లేదా బెదిరింపు వ్యాఖ్యలు చేయకూడదని సుబ్బారెడ్డి తెలిపారు. అది రాజ్యసభ సభ్యుడి భావప్రకటనా హక్కుకు భంగం కలిగించడమేనని స్పష్టంచేశారు. పార్లమెంటరీ నైతికత, సభా మ­ర్యా­దల ఉల్లంఘనపై పరిశీలించి, తగిన చర్యలు తీసుకో­వా­లని కోరుతూ రాజ్యసభ చైర్మన్‌కు, ప్రివిలేజ్‌ కమిటీకి వేర్వేరుగా ఫిర్యాదులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement