మండిపోతున్న నిత్యావసరాల ధరలు
అల్లం నుంచి పంచదార వరకూ ధరల దడదడ
8 నెలల్లో ఆహార ధరలకు రెక్కలు
తల్లడిల్లుతున్న సగటు జీవి
సాక్షి, అమరావతి: ఇంట్లో వంట చేసుకుంటే ఖర్చు తగ్గుతుందని సామాన్య, మధ్యతరగతి కుటుంబాల విశ్వాసం. కానీ ఇప్పుడు ఆ లెక్కలు తప్పుతున్నాయి. ఈ రోజు వంట ఏంటి? ఏం కూర వండాలి? అన్న ప్రశ్నల స్థానంలో నేడు మార్కెట్లో ఏది తక్కువ ధరకు దొరుకుతుంది? అని ఆరా తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అల్లం, ఉల్లి, వెల్లుల్లి నుంచి పంచదార, నూనె, గుడ్లు, చికెన్ వరకు నిత్యావసర వస్తువుల ధరలు ఠారెత్తిస్తున్నాయి. ఈ పరిణామం మధ్య తరగతి, పేద ప్రజల కుటుంబ బడ్జెట్ను తలకిందులు చేస్తోంది.
74 శాతం వరకు భగ్గుమంటున్న ధరలు
కేంద్ర గణాంక శాఖ సమాచారం ప్రకారం వార్షిక ఆహార వ్యయాలు (ఫుడ్ బిల్స్) 2026 జనవరిలో 2.13 శాతం పెరగ్గా (2025 జనవరితో పోల్చి) ఆగస్టు నాటికి ఏకంగా 5.95 శాతానికి చేరింది. ఏడాది ప్రారంభంతో పోలిస్తే ఆహార ధరల తీవ్రత ఏ స్థాయిలో పెరిగిందో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. గతేడాది ధరలతో పోలిస్తే దాదాపు నిత్యావసర వస్తువుల ధరలన్నీ 10 శాతంనుంచి 74 శాతం మేర పెరుగుదల రేటును నమోదుచేసుకున్నాయి. రోజువారీ వంటల్లో తరచుగా ఉపయోగించే అల్లం, ఉల్లి, వెల్లుల్లి ధరలు సైతం రికార్డు స్థాయిలో పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
చివరికి వంటగ్యాస్, విద్యుత్, నీటి వినియోగ ఖర్చులు కూడా పెరుగుతుండడం సామాన్య, మధ్యతరగతి కుటుంబాల ఆహార వ్యయంపై ప్రభావం చూపుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. వెరసి ఈ పరిస్థితి.. తమకు నచ్చిన ఆహారం వండుకునే విషయంలో సామాన్యుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రోజువారీగా పెరుగుతున్న ధరలతో ఎప్పటికప్పుడు వండుకునే ఆహారం మెనూ మార్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
వ్యాపారుల కృత్రిమ కొరతే కారణం
సాధారణంగా డిమాండ్ అండ్ సఫ్లై పరిస్థితులపై నిత్యావసర వస్తువుల ధరలు ఆధారపడి ఉంటాయి. ఒక నెలలో కాస్త పెరిగినా..మరుసటి నెలలో కొంత మేర తగ్గుదల చోటు చేసుకుంటాయి. మరికొంత కాలం నిలకడగానూ ఉంటాయి. కానీ గడిచిన 8 నెలలుగా ఇంటి వంటల్లో ఉపయోగించే ప్రధాన నిత్యావసరాల ధరలు క్రమేపీ పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ఎల్నినో పేరుతో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ ఇష్టానుసారంగా ధరలు పెంచేస్తున్నారన్న వాదన విన్పిస్తోంది. ఈ నేపథ్యంలో మెజార్టీ మధ్య, దిగువ తరగతి కుటుంబాలు ఖరీదైన పదార్థాల వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు. మాంసాహారం లేదా గుడ్ల కొనుగోళ్లను వాయిదా వేయడం, తక్కువ ధరలో లభించే కూరగాయలకు మారడం వంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆహార వినియోగదారుల నివేదిక స్పష్టం చేస్తోంది.
రాష్ట్రంలో ఏకంగా 10 శాతం ఆహార ధరల తీవ్రత
ఇక రాష్ట్రంలో ధరల తీవ్రతతో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ధరల కట్టడిలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా విఫలమవుతోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జాతీయ సగటుతో పోల్చితే పలు నిత్యావసరాల ధరలు రాష్ట్రంలో తీవ్రంగా ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర ప్రణాళికా శాఖ స్వయంగా ఇటీవలి నివేదిక ప్రకారం 2025 జూలైతో పోల్చి 2026 జూలైలో రాష్ట్ర వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 9.13 శాతంగా నమోదయ్యింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 10 శాతానికి చేరడం.. సామాన్య కుటుంబాలపై ధరల భారానికి నిదర్శనం. వార్షికంగా చూస్తే జూలైలో ఉల్లి ధరలు ఏకంగా 153 శాతం పెరగ్గా, అల్లం (102.9 శాతం), చికెన్ (37.3 శాతం), ఎండుమిర్చి (30 శాతం)ధరలు భారీగా పెరిగాయి. 2026 జూన్తో పోల్చి 2026 జూలైలో చూసినా ఉల్లి, టమోటా ధరలు భారీగా 54 శాతం, 46 శాతం చొప్పున పెరగడం గమనార్హం.


