డీఎస్సీ అతి పెద్ద కుంభకోణం | Round Table Meeting On DSC Vijayawada | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అతి పెద్ద కుంభకోణం

Sep 19 2026 2:43 AM | Updated on Sep 19 2026 2:43 AM

Round Table Meeting On DSC Vijayawada

సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు, మేధావులు, డీఎస్సీ అభ్యర్థులు

ఐఏఎస్‌ మాజీ అధికారి విజయ్‌కుమార్‌ మండిపాటు

మంత్రి లోకేశ్‌ బాధ్యత వహించి రాజీనామా చేయాలి 

మెరిట్‌ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం 

డీఎస్సీలో అక్రమాలపై విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం  

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మెగా డీఎస్సీ–2025లో ప్రతిభకు పాతరేసి అతి పెద్ద కుంభకోణంగా మార్చేశారని ఐఏఎస్‌ మాజీ అధికారి, లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ తీవ్ర స్థాయిలో విమర్శించారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ పాలనలో జరిగిన డీఎస్సీ అక్ర­మా­లపై చర్చించేందుకు విజయవాడలో శుక్ర­వారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్‌ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. విజయ్‌కుమార్‌తో పాటు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీ విద్యార్థి, నిరుద్యోగ యువజన జేఏసీ కన్వీనర్‌ ఎంబేటి రామచంద్ర, డీఎస్సీలో నష్టపోయిన మెరిట్‌ అభ్యర్థులు పాల్గొని మాట్లాడారు.

కుంభకోణానికి ఇదే నిదర్శనం..
విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ చంద్రబాబు, లోకేశ్‌లు స్పోర్ట్సు కోటా కోసం రెండు జీవోలు తెచ్చి, వారి పని పూర్తి అయ్యాక వాటిని మార్చేశారని, డీఎస్సీలో కుంభకోణం జరిగిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. ప్రశ్నపత్రం తయారు చేసే చోట పనిచేసే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి ఎప్పుడూ రానన్ని అత్యధిక మార్కులు వచ్చాయని, దేశంలో ఏ డీఎస్సీలో కూడా ఇలా జరగలేదన్నారు. ఇంత పెద్ద కుంభకోణానికి పాల్పడ్డ విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, న్యాయమూర్తి పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

బాధితులకు సమాధానం చెప్పండి
మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలు ప్రజలకు తెలియజేస్తున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. డీఎస్సీలో ఎలా మోసం జరిగిందో అభ్యర్థులే చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, బాధ్యత గల వారైతే వెంటనే సీబీఐ విచారణ చేయించాలన్నారు. లోకేశ్‌కు చేతనైతే బాధిత అభ్యర్థుల ముందు సమాధానం చెప్పాలన్నారు. మంత్రిగా ఉండేందుకు లోకేశ్‌ అర్హుడు కాదని, తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దొడ్డి దారిన వచ్చిన ఉద్యోగాలపై విచారణ జరపాల్సిందేన్నారు.

వైఎస్సార్‌సీపీ పోరాటం ఆగదు
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేస్తున్నారే తప్ప ప్రభుత్వం నోరు విప్పడం లేదన్నారు. వెటర్నరీ పోస్టులను కూడా అమ్ముకుందామని చూసి, చివరకు వాటి నిర్వహణ బాధ్యతను ఏపీపీఎస్సీకి ఇచ్చారంటేనే లోపాలున్నాయని అర్థమవుతోందన్నారు.

డీఎస్సీతో పాటు తమ ప్రభుత్వం నిర్వహించిన ఏపీపీఎస్సీ పరీక్షలపై కూడా సీబీఐ విచారణ చేయాలని జగన్‌ కోరారని, ఆ ఛాలెంజ్‌ను తీసుకునే దమ్ము ధైర్యం వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వానికి లేదని విమర్శించారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన బాధిత డీఎస్సీ మెరిట్‌ అభ్యర్థులు తమ ఆవేదనను వెల్లడించారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement