23 ఉరిశిక్షలు వేసిన జడ్జి ఆవేదన
97 కేసుల ఉపసంహరణపై ఆగ్రహం
ముజఫర్నగర్: ‘‘ఒక న్యాయమూర్తి తనకే అన్యాయం జరిగితే ఎక్కడకు వెళ్లాలి’’... ఇదీ జస్టిస్ రవికుమార్ దివాకర్ ఆవేదన. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి అయిన జస్టిస్ రవికుమార్ అతితక్కువ కాలంలో 11 కేసుల్లో 23 మందికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పులిచ్చి వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. అయితే గత నెల 18న జస్టిస్ రవి కుమార్ దివాకర్ విచారణ మొదలుపెట్టిన సుమారు 97 క్రిమినల్ కేసులను ఆ కోర్టు నుంచి ఉపసంహరించుకుంటూ అప్పటి ముజఫర్నగర్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇలా చేయడం అన్యాయమని, విచారణ ప్రారంభమైన తరువాత సరైన పద్ధతిని అనుసరించకుండా కేసులను ఉపసంహరించడం చట్టం ప్రకారం సరికాదని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. పదకొండేళ్లుగా సాగుతున్న మాదకద్రవ్యాల కేసులో అశోక్ భారతీ అనే వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ అడ్మిని్రస్టేటివ్ ఉత్తర్వుల ద్వారా విచారణ ప్రారంభమైన కేసులను వెనక్కు తీసుకోరాదని, ఇది చట్టవిరుద్ధమైంది మాత్రమే కాకుండా.. డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అధికార పరిధిలో లేని అంశమని వ్యాఖ్యానించారు.
తన కోర్టు నుంచి ఉపసంహరించుకున్న కేసులపై వెలువడే నిర్ణయాల చట్టబద్ధత ఏమిటని ప్రశ్నించారు. పైగా పదవీ విరమణకు కొంత సమ యం ముందు ఆ న్యాయమూర్తి ఈ ఉత్తర్వులు జారీ చేశారని, తగిన కారణాలూ చూపలేదని జస్టిస్ రవికుమార్ దివాకర్ తెలిపారు. ‘‘న్యాయం చేయడం ఒక న్యాయమూర్తి పని. అతడికే అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్లాలి’’అని వ్యాఖ్యానించారు. అధికారాన్ని బాధ్యతతో, విచక్షణతో ఉపయోగించాలని, హద్దుల్లేని అధికారం ప్రజల రక్షణ కోసం ఉద్దేశించిన వ్యవస్థను కాస్తా వారిని అణచివేసేదిగా మారుతుందని హెచ్చరించారు.


