తమిళనాడు రాజకీయాల్లో సీఎం విజయ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి దశాబ్ధాలుగా ఉన్న పార్టీలకే చెక్ పెట్టి అధికారంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే వచ్చిన నాటి నుంచి తనదైన పాలనా మార్కును చూపిస్తున్న విజయ్ ఇప్పుడు మరో అద్భుత పథకం అమలు చేయడానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే బంగారు తల్లులకు కానుకగా గ్రాము పుత్తడి ఇచ్చే పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నారు.
తమిళనాడు ప్రజలకు విజయ్ ఇచ్చిన ఎన్నికల హామీలలో ప్రధానమైనది.. ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించిన నవజాత శిశువులకు ఒక గ్రాము బంగారు ఉంగరాల బహుమతి. ఈ నేపథ్యంలోనే 'తైమామన్ తంగ మోతిరం' (మేనమామ బంగారు ఉంగరం) పథకం సెప్టెంబర్ 28న లాంఛనంగా ప్రారంభించబడుతునట్లు సమాచారం. అయితే దీనికి ఈ ఏడాది జూన్ 22 నుండి ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించిన పిల్లలందరూ అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వ లెక్కలు
ప్రభుత్వ లెక్కల ప్రకారం తమిళనాడులో ఏటా సుమారు 7.8 లక్షల జననాలు నమోదవుతాయి. వీటిలో దాదాపు 99.9 శాతం ప్రసవాలు ఆసుపత్రులలో జరుగుతుండగా, సుమారు 4.2 లక్షలు - అంటే 53 శాతం - ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్నాయి. తమిళనాడు శాశ్వత నివాసితులై, ఆర్.సి.హెచ్. గుర్తింపు సంఖ్యతో పి.ఐసి.ఎం.ఇ.లో నమోదు చేసుకున్న తల్లుల నవజాత శిశువులకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి ఉంగరానికి ఒక ప్రత్యేకమైన సీరియల్ నంబర్ ఉంటుందని అది ట్యాంపర్-ప్రూఫ్ ప్యాకేజింగ్లో సరఫరా చేయబడుతుంది. మొదటి దశలో ఇప్పటికే 1.28 లక్షల ఉంగరాలను సేకరించినట్లు ప్రభుత్వం తెలిపింది.
రెండు నియోజకవర్గాలకు బైపోల్
తమిళనాడులో మధురాంతకం, ధరాపురం నియోజకవర్గాలలో అక్టోబర్ 6న ఉపఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉపఎన్నికల కోసమని ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct) అమల్లోకి వచ్చింది. దీంతో ప్రస్తుతానికి ఆ రెండు నియోజకవర్గాల్లో ఈ పథకం అమలు తాత్కాలికంగా నిలిచిపోనుంది.


