ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న షెహజాద్ భట్టి నెట్వర్క్ (SBN)ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ వివరాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా తెలిపారు. ఉగ్రవాదంపై ప్రధాని మోదీ అనుసరిస్తున్న ‘జీరో టాలరెన్స్’ విధానంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. “ఈ ముఠా సరిహద్దుల గుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్లో పాలుపంచుకోవడంతో పాటు, యువతను, చిన్న నేరస్థులను ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తోంది. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, మత సామరస్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ సిండికేట్ విద్వేషపూరిత డిజిటల్ కంటెంట్ను కూడాప్రచురించింది” అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థను నిషేధించినట్లు తెలిపారు.
షెహజాద్ భట్టి నెట్వర్క్ (SBN) అమాయక యువతను, స్థానిక నేరస్థులను ఉపయోగించుకుని సరిహద్దుల నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడం, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటం ద్వారా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు, మత సామరస్యానికి, అంతర్గత భద్రతకు తీవ్ర ముప్పు కలిగించడం లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ అని కేంద్ర హోంశాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది.
నిషేధిత ఉగ్రవాద సంస్థల జాబితా ఉన్న చట్టంలోని మొదటి షెడ్యూల్లో షెహజాద్ భట్టి నెట్వర్క్ (SBN)ను చేర్చేందుకుUAPAలోని సెక్షన్ 35(1)(a)ను కేంద్రం ఉపయోగించింది. ఎస్బీఎన్ ‘ఉగ్రవాదంలో’ పాలుపంచుకుందని, భారతదేశంలో వివిధ ఉగ్రవాద చర్యలకు పాల్పడిందని కేంద్రం భావిస్తున్నందున ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.


