భారత్ ఆతిథ్యంగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సు వేళ భారత్కు దౌత్య పరంగా కీలక విజయం లభించింది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో సభ్యదేశాలన్నీ *"న్యూఢిల్లీ డిక్లరేషన్"*కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. గతంలో పశ్చిమాసియా యుద్ధంపై విభేదాల కారణంగా విదేశాంగ మంత్రుల సమావేశంలో ఉమ్మడి ప్రకటన వెలువడకపోయినా, ఈసారి నాయకుల స్థాయిలో ఏకాభిప్రాయం వెలువడనుంది.
న్యూఢిల్లీ డిక్లరేషన్లో అత్యంత ప్రధాన సందేశంగా "సంభాషణ (Dialogue), దౌత్యం (Diplomacy) ద్వారానే వివాదాలకు పరిష్కారం" అనే సూత్రాన్ని పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం వంటి అంతర్జాతీయ ఘర్షణల నేపథ్యంలో ఇదే భారత్ నిరంతరం చెబుతున్న వైఖరిని ప్రధాని మోదీ పదే పదే స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక ప్రకటన వెలువడింది.
న్యూ ఢిల్లీ డిక్లరేషన్ ప్రధాన అంశాలు
అంతర్జాతీయ వివాదాలకు యుద్ధం కంటే చర్చలు, దౌత్యమే పరిష్కార మార్గమని స్పష్టం.
ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఖండిస్తూ దానికి ఎలాంటి సమర్థన ఉండదని పునరుద్ఘాటింపు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా ప్రపంచ పాలనా వ్యవస్థల్లో సమగ్ర సంస్కరణలకు మద్దతు.
అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ నిర్ణయాల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్.
వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, డిజిటల్ సహకారం, ప్రత్యామ్నాయ చెల్లింపు వ్యవస్థలపై సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే నిర్ణయం.
బ్రిక్స్ విస్తరణ తర్వాత ఇరాన్–యూఏఈ వంటి విభేదాలున్న దేశాలను ఒకే ప్రకటనపై ఏకాభిప్రాయానికి తీసుకురావడం భారత్ అధ్యక్షతకు పెద్ద పరీక్షగా నిలిచింది. అయినప్పటికీ ఈ పరీక్షలో సభ్యదేశాలన్నిటినీ ఏకతాటిపైకి తేవడం దౌత్య పరంగా భారత్కు కీలక విజయం.
బ్రిక్స్ నాయకుల సమావేశం ముగిసిన అనంతరం సాయంత్రం 4 గంటలకు న్యూఢిల్లీ డిక్లరేషన్తో కూడిన ఉమ్మడి ప్రకటన అధికారికంగా విడుదల కానుంది. ఇందులో భారత్కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వానికి మద్దతు, బహుపాక్షిక ప్రపంచ వ్యవస్థ బలోపేతంపై కీలక ప్రకటనలు ఉండే అవకాశం ఉండనున్నట్లు సమాచారం.


