ఢిల్లీ: 18 అంతర్జాతీయ బ్రిక్స్ సదస్సుకు భారత్ అతిథ్య నివ్వనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12,13 ఢిల్లీలోని భరత మండపంలో జరిగే ఈ సదస్సుకు ప్రపంచ అగ్రనేతలతో పాటు విదేశీ ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఢిల్లీకి రానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అత్యంత కఠిన ఆంక్షలు విధించనుంది. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గాల మళ్లింపులు అమల్లో ఉండనున్నాయి.
రేపు బ్రిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నేటి నుంచి (శుక్రవారం) ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ సహాయంతో నడిచే, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఆ రోజు పనిచేయవు. వారాంతం అనంతరం పాఠశాలలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఢిల్లీ మెట్రో సేవలు కొనసాగింపు
అయితే బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైలు సేవలు పూర్తిగా నిలిపివేయడం లేదు. నగరవ్యాప్తంగా మెట్రో సేవలు కొనసాగుతాయి. అయితే సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్లోని ఢిల్లీ మెట్రో మ్యూజియాన్ని సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు మూసివేయనున్నారు. 35కుపైగా రహదారులపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
విదేశీ ప్రముఖులు, వీవీఐపీల కాన్వాయ్ల రాకపోకల కోసం ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 4,800 మంది ట్రాఫిక్ సిబ్బందిని విధుల్లో మోహరించారు. వీవీఐపీ రాకపోకలు, కాన్వాయ్ రిహార్సల్స్ సమయంలో 22 ప్రాంతాల్లో ట్రాఫిక్ను మళ్లించనున్నారు.
మథురా రోడ్, సర్దార్ పటేల్ మార్గ్, శాంతి పథ్, జనపథ్, అశోకా రోడ్, బరాఖంబా రోడ్, టాల్స్టాయ్ మార్గ్, ఆఫ్రికా అవెన్యూ రోడ్, నీతి మార్గ్, ఏపీజే అబ్దుల్ కలాం రోడ్ తదితర 35కుపైగా రహదారులపై వివిధ సమయాల్లో ట్రాఫిక్ ఆంక్షలు లేదా మళ్లింపులు ఉండవచ్చని అధికారులు తెలిపారు.
బస్సులు, క్యాబ్లకు మార్గ మళ్లింపులు
సదస్సు జరిగే రోజుల్లో పరిస్థితిని బట్టి బస్సుల రూట్లను మళ్లించడం లేదా కొంతకాలం నియంత్రించడం జరగవచ్చని అధికారులు పేర్కొన్నారు. క్యాబ్ సేవలు మాత్రం యధావిధిగా కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. అత్యవసరం కాని ప్రయాణాలను ముందుగా ప్లాన్ చేసుకోవాలని, బయలుదేరే ముందు తాజా ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించాలని ఢిల్లీ వాసులకు అధికారులు సూచించారు.


