ఒక నది బాగుపడాలంటే అధికారులు రావాలి.. భారీ నిధులు కేటాయించాలి.. పెద్ద సంఖ్యలో సిబ్బంది పనిచేయాలి. కానీ 20 ఏళ్ల యువకుడు మాత్రం ఇవేవీ లేకుండానే ఓ నదిని శుభ్రం చేసి చూపించాడు. నెలల తరబడి ఒంటరిగా శ్రమిస్తూ ప్లాస్టిక్, చెత్తాచెదారం తొలగించి అజ్నార్ నదికి కొత్త రూపు తీసుకొచ్చాడు. సోషల్ మీడియాలో అతడి పని వైరల్ కావడంతో ఆపై ఏకంగా అంతర్జాతీయ పర్యావరణ సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్ అందుకున్నాడు. ఇప్పుడు తన తదుపరి కార్యాచరణ సైతం ప్రకటించేశాడు..
మధ్యప్రదేశ్కు చెందిన బిట్టూ తబాహీ అసలు పేరు సురేంద్ర సింగ్ చౌధరి. అజ్నార్ నది కాలుష్యంతో నిండిపోవడాన్ని చూసిన అతడు.. సమస్య గురించి మాట్లాడటంతో ఆగిపోలేదు. స్వయంగా రంగంలోకి దిగి నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్, చెత్త, ఇతర వ్యర్థాలను తొలగించడం మొదలుపెట్టాడు. అవసరమైన ప్రాథమిక సామగ్రిని తన సొంత డబ్బుతో సమకూర్చుకుంటూ.. ఎవరూ తోడుగా లేకపోయినా పదేపదే నది వద్దకు వెళ్లి శుభ్రం చేస్తూ వచ్చాడు.
మార్పును వీడియోలుగా..
నది శుభ్రం చేసే ముందు పరిస్థితి ఎలా ఉంది.. తాను శ్రమించిన తర్వాత ఎలా మారింది అన్న విషయాలను బిట్టూ సోషల్ మీడియాలో వీడియోల రూపంలో పంచుకున్నాడు. తొలుత స్థానికంగా కనిపించిన ఈ ప్రయత్నం క్రమంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. చెత్తతో నిండిన నది ప్రాంతాన్ని స్వయంగా శుభ్రం చేస్తున్న అతడి వీడియోలు వైరల్ కావడంతో బిట్టూ పేరు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది.
డచ్ సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్..
బిట్టూ చేసిన పని చివరకు ‘ది ఓషన్ క్లీన్అప్’ దృష్టిని కూడా ఆకర్షించింది. డచ్ పర్యావరణవేత్త బోయన్ స్లాట్ స్థాపించిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు, నదుల్లోని ప్లాస్టిక్ కాలుష్యాన్ని తొలగించేందుకు పనిచేస్తోంది. బిట్టూ కృషిని గుర్తించిన సంస్థ అతడికి ఉద్యోగ ఆఫర్ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో అతడికి మరింతగా అభినందనలు వెల్లువెత్తాయి.
‘తర్వాత ఏ రాష్ట్రానికి రావాలి?’..
ఉద్యోగ ఆఫర్ వచ్చిన తర్వాత బిట్టూ సోషల్ మీడియాలో మరో వీడియోను షేర్ చేశాడు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన అతడు.. ఇక తర్వాత ఏ రాష్ట్రానికి వెళ్లి శుభ్రత కార్యక్రమం చేపట్టాలని అడిగాడు. దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడి నదులు, పరిసరాలను శుభ్రం చేయాలనే తన ఆలోచనను వెల్లడించాడు.
దీంతో నెటిజన్లు కూడా పెద్ద సంఖ్యలో స్పందించారు. బిహార్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల పేర్లను సూచిస్తూ కామెంట్లు చేస్తున్నారు. తమ ప్రాంతాల్లోనూ ఇలాంటి శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు.
కొసమెరుపు.. బిట్టూ శుభ్రం చేసిన అజ్నార్ నది మళ్లీ కాలుష్యం బారిన పడడం ప్రారంభమైంది. కొందరు చెత్తాచెదారం అందులో వేయడం.. వాటి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో కొందరు యువకులు అక్కడ గస్తీ కాస్తూ బిట్టూ కష్టం వృథా కానివ్వకుండా కాపాడుకుంటున్నారు.


