‘ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపండి’.. పుతిన్‌తో ప్రధాని మోదీ | Modi urged Vladimir Putin to help resolve the Russia Ukraine conflict | Sakshi
Sakshi News home page

‘ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపండి’.. పుతిన్‌తో ప్రధాని మోదీ

Sep 11 2026 6:07 PM | Updated on Sep 11 2026 6:37 PM

Modi urged Vladimir Putin to help resolve the Russia Ukraine conflict

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభానికి దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని భారత ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిపిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని మోదీ యుద్ధాన్ని తక్షణమే ఆపి, శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇరు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించేందుకు భారత్ తన వంతు సహాయసహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.  

భారత్‌ అధ్యక్షతన న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్‌  శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌కు విచ్చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని ‘భారత్ మండపం’ వేదికగా ఇరు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రష్యన్ భాషలోకి అనువదించిన ప్రముఖ తమిళ ప్రాచీన కావ్యమైన ‘తిరుక్కురళ్’ ప్రతిని పుతిన్‌కు ప్రత్యేక బహుమతిగా అందజేశారు. దాదాపు రెండు వేల ఏళ్ల నాటి ఈ గ్రంథంలోని మానవతా విలువలను మోదీ ఈ సందర్భంగా పుతిన్‌కు వివరించారు.

రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష రంగాల బలోపేతంపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.రష్యాలో జరగబోయే 24వ ఇండో-రష్యా వార్షిక శిఖరాగ్ర సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా ప్రధాని మోదీని అధ్యక్షుడు పుతిన్ అధికారికంగా ఆహ్వానించగా.. ఆయన ఆ ఆహ్వానాన్ని స్వీకరించారు. దీనికి సంబంధించిన తుది తేదీలను దౌత్య అధికారులు త్వరలోనే ఖరారు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement