ముంబై: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు కొలువుదీరిన 21 రాష్ట్రాల్లోనూ 2029 ఏడాదిలోపు ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)ని అమలుచేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. గత పుష్కర కాలంలో ప్రధాని మోదీ సారథ్యంలో కేంద్రప్రభుత్వం సాధించిన ఘనత, మోదీ నాయకత్వంలో గత పాతికేళ్లలో బీజేపీ ప్రయాణం, మోదీ జన్మదినంను గుర్తుచేస్తూ సెపె్టంబర్ 17 నుంచి సేవా సంకల్ప్ అభియాన్ జరగబోతోందని ప్రకటించాక పలు అంశాలపై ఆదివారం ముంబైలో అమిత్షా మీడియాతో మాట్లాడారు. ‘‘త్రిపుల్ తలాఖ్ను రద్దుచేసి ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించాం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూసీసీ అమలవుతోంది. 2029లోపు ఎన్డీఏపాలిత అన్ని రాష్ట్రాల్లో ఇది అమలయ్యేలా చేస్తా’’అని అన్నారు. 2029లో సార్వత్రిక ఎన్నికలున్న విషయం తెల్సిందే.
మోదీ శకంలో అన్నీ మారుతున్నాయ్..
‘‘గతంలో దేశంలో అవినీతి, కులతత్వం, వారసత్వ రాజకీయాలు తిష్టవేసి దారుణ పరిస్థితులను సృష్టించాయి. ఇప్పుడు మోదీ సారథ్యంలో కేంద్రప్రభుత్వం వాటినన్నింటినీ పారద్రోలింది. మోదీ శకం ఆరంభమైంది. ఇప్పుడంతా పనితీరు ఆధారిత రాజకీయాలే’’అని షా అన్నారు. మానవసేవే మాధవ సేవ తరహాలో జనసేవే ప్రభు సేవ అనే కొత్త నినాదం షా విన్పించారు. 2047కల్లా అభివృద్ధి చెందిన భారత్ను సాకారంచేసేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతున్నాం. మోదీ సారథ్యంలో గుజరాత్లో, దేశంలో పెను సానుకూల మార్పులొచ్చాయి. ఇప్పుడు రాజకీయ వ్యవస్థ ప్రాథమికస్థాయిలో సంస్కరణల బాటలో పయనిస్తోంది’’ అని మోదీని షా కొనియాడారు.


