సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గణేశ్ ఉత్సవాలు హిందువుల ఐక్యతా స్ఫూర్తికి, భక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. హిందువులంతా సంఘటితంగా ఉంటూ ఆనందోత్సవాలతో గణేశ్ ఉత్సవాలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గణేశ్ మండపాల నిర్వహణలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బండి సంజయ్ సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రులను నిర్వహించాలని అన్నారు.
హిందూ పండుగలను ఘనంగా నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బండి సంజయ్ పేర్కొన్నారు. ధర్మాన్ని కాపాడుతూ సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఐక్యంగా గణేశ్ ఉత్సవాలను జరుపుకుంటూ భక్తిపారవశ్యంతో వినాయకుడిని కొలుద్దామని అన్నారు.
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు నిండాలని బండి సంజయ్ ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లోని కష్టాలు, విఘ్నాలు తొలగిపోయి ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని కోరుకున్నారు.
గణనాథుడి ఆశీస్సులతో తెలంగాణ మరింత సుభిక్షంగా ఉండాలని బండి సంజయ్ ఆకాంక్షించారు. ప్రతి గ్రామం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాలని, ప్రజల కష్టాలు తొలగిపోయి ప్రతి ఇంటా సంతోషం వెల్లివిరియాలని, గణనాథుడి ఆశీస్సులతో తెలంగాణలో ధర్మ విజయం సాధించాలని కోరుకున్నారు.
ఇదీ చదవండి: ఏడాదైనా చైర్మన్ లేరు.. బాబ్జీ సంచలన నిర్ణయం


