విజయవాడ: నగరాల కార్పొరేషన్కు వెంటనే నూతన చైర్మన్ను నియమించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయన బాబ్జీ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన దీక్షకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నగరాల కార్పొరేషన్ గత చైర్మన్ మరణించి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు కొత్త చైర్మన్ను నియమించకపోవడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాబ్జీ దీక్షను విరమింపజేసి ఆయన ప్రాణాలను కాపాడాలని కోరారు.
నగరాల కులాన్ని బీసీ జాబితాలో చేర్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని వెల్లంపల్లి పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా నగరాల కార్పొరేషన్ను ఏర్పాటు చేశామని తెలిపారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విజయవాడ మేయర్గా రాయన భాగ్యలక్ష్మిని, దుర్గగుడి చైర్మన్గా పైలా సోమినాయుడిని నియమించడం ద్వారా నగరాల సామాజిక వర్గం ఆత్మగౌరవాన్ని పెంచామని చెప్పారు.
నగరాల కార్పొరేషన్కు చైర్మన్ను నియమించే వరకు పోరాటం కొనసాగిస్తామని వెల్లంపల్లి స్పష్టం చేశారు. బాబ్జీ ఆమరణ నిరాహార దీక్షపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.


