హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే శ్రీ గణేశుడి అనుగ్రహంతో తెలంగాణ రాష్ట్రం శాంతి, ఐక్యత, ప్రగతి, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అభిలషించారు.
శ్రీ గణేశుడిని విఘ్నవినాశకుడిగా, శుభప్రదుడిగా ఆరాధించడం భారతీయ సంస్కృతిలో విశిష్టమైన సంప్రదాయమని గవర్నర్ పేర్కొన్నారు. ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా ముందుగా గణేశుడిని ప్రార్థించడం ద్వారా కార్యసిద్ధి కలుగుతుందని విశ్వసిస్తారని తెలిపారు. తెలంగాణతో పాటు దేశ ఐక్యత, శాంతి, అభివృద్ధి, సౌభాగ్యానికి అడ్డుగా నిలిచే అన్ని విఘ్నాలను విఘ్నేశ్వరుడు తొలగించి, ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సును ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. వినాయక చవితి పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందం, సామరస్యం, సుఖసంతోషాలను నింపాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ మేరకు లోక్ భవన్ కార్యాలయం పత్రికా ప్రకటనను విడుదల చేసింది.


