ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో దారుణం చోటు చేసుకుంది. ఓ దుండగుడు పేలుడు పదార్థాలతో ఉన్న వాహనంతో మసీదులోకి దూసుకెళ్లి బాంబ్ బ్లాస్ట్ చేశారు. ఈ దుర్ఘటనలో 15 మంది మరణించగా మరో 56 మంది గాయపడ్డారు. అయితే బాంబు దాడి సమీపంలో పోలీస్ కార్యాలయాలు ఉండడంతో ఐదుగురు పోలీసు అధికారులు మృతిచెందారు.
ఈ ప్రమాదం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని కోహట్ జిల్లాలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో పోలీస్ కార్యాలయాల బయటి గోడ కూలిపోగా, మసీదు తీవ్రంగా దెబ్బతింది. బాంబు దాడి అనంతరం ఆయుధాలతో ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశించడానికి యత్నింగా వారిపై పోలీసులు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అయితే దాడిలో గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దాడిని ఖండించిన ఆయన పేలుడులో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
కాగా ఈ మధ్య కాలంలో పాకిస్తానీ తాలిబన్లు అక్కడి పోలీసులతో పాటు అక్కడి పౌరులపై దాడులను తీవ్రతరం చేశారు. 2023లో, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ రాజధాని అయిన పెషావర్లోని ఒక మసీదులో జరిగిన దాడిలో ఒక ఆత్మాహుతి దాడి చేసి 101 మందిని చంపారు.


